మహబూబ్ నగర్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులు వ్యవసాయం వదిలి ముంబాయికి వలసలు ( Mumbai Migration ) వెళ్లే పరిస్థితిని తీసుకొచ్చారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Former Minister Srinivas Goud ) ఆరోపించారు. మహబూబ్ నగర్ మండల పరిధిలోని కోడూరు చౌరస్తాలో గురువారం నిర్వహించిన రైతు సదస్సు, ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం పండుగ లెక్కన సాగు చేశారు. కేసీఆర్ హయాంలో పంటల సాగు పెరిగింది. భూమి విలువ పెరిగింది. చెక్ డ్యాంలు కట్టారు. చెరువులు నింపారు. అప్పుడు యూరియాకు కొరత లేదు. కరెంటు సరిపడ ఇచ్చారు. ఇప్పుడు యూరియా కోసం రైతులు పంట పొలాలు వదిలి యూరియా కేంద్రాల వద్ద గంటల తరబడి నిలబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రేవంత్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పిండ్రు. కౌలు రైతులకు, రైతు కూలీలకు డబ్బులు ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. రైతులకు రైతు బంధు లేదు.. రైతు బీమా ప్రీమియం కట్టలేదు. రైతు చనిపోతే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిందని అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, మాజీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, రైతు కమిటీ మాజీ చైర్మన్ మల్లు నర్సింహా రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మల్లు దేవేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ సుధా శ్రీ, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, రాజ గోపాల్, చెన్నయ్య యాదవ్, అల్లాఉద్దీన్, రాఘవేందర్ గౌడ్, శ్రీనివాసులు, నర్సింహులు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.