మూడేండ్ల నుంచి తెలంగాణలో నాట్లు వేసేందుకు వస్తున్నామని చెప్తున్నారు ఉత్తరప్రదేశ్కు చెందిన మిలన్ అనే కూలీ. బంధువులు, స్నేహితులతో కలిసి నాట్లు వేసేందుకు వచ్చి ఖర్చులు పోగా, ప్రతి సారి రూ.45 వేల దాకా ఇంటికి తీసుకుపోతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో పనులే లేవని, ఇక్కడి రైతులే తమను సాదుతున్నారని తెలిపారు.
బీహార్లోని భోజ్పూర్ జిల్లా ఆనార్కు చెందిన దురేందర్కుమార్ ఆరేండ్ల కిందట చౌటుప్పల్కు పని కోసం వచ్చారు. స్థానికంగా ఉంటూ తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నారు. రోజు పని దొరుకుతున్నదని, రూ.900 వరకు సంపాదిస్తున్నారని చెప్తున్నారు. సొంత రాష్ట్రంలో పని దొరుకుడు చాలా కష్టమని, పని దొరికినా రూ.500 మించి రావని అంటున్నారు. అక్కడ కుటుంబం గడవటం కష్టంగా మారటంతో ఇక్కడికి వచ్చానని, తనతో పాటు మరికొంత మందిని తీసుకొచ్చానని వెల్లడించారు. తెలంగాణలో పనులకు కొదవ లేదని, ఎంతో మంది కార్మికులకు ఉపాధి లభిస్తున్నదని వివరించారు.
కావాల్సినంత పని.. పనికి తగ్గ కూలీ ఇంతకన్నా ఇంకేం కావాలి.. అందుకే వరుసపెట్టి వస్తున్నరు వలస కూలీలు! వ్యవసాయ పొలాల్లో, రైస్ మిల్లుల్లో.. ఇటుక బట్టీల్లో, ఇసుక క్వారీల్లో.. సెంట్రింగ్ పనుల్లో, భవన నిర్మాణాల్లో.. ఎక్కడ చూసినా ఉత్తరాది కూలీలే..!!
(నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్)
నాడు వలసబాట పట్టిన తెలంగాణకు.. నేడు వలస కూలీలు వరుసపెట్టి వస్తున్నారు. ఒక్క పని అని కాదు.. ఏ పనిలో వెతికినా వేరే రాష్ర్టా ల కూలీలే కనిపిస్తున్నారు. స్వరాష్ట్రం సిద్ధించాక రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం, రియల్ ఎస్టేట్ రంగాలు విపరీతంగా విస్తరించాయి. కూలీల అవసరం పెరిగింది. ఇతర రాష్ర్టాల్లో ఉపాధి లేకపోవటంతో అక్కడి కూలీలంతా ఇక్కడికి వరుస కడుతున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, బీహార్ తదితర ఉత్తరాది రాష్ర్టాల నుంచి ఇక్కడికి వలసలు ఎక్కువగా ఉన్నాయి. తమ సొంత రాష్ట్రంలో రోజంతా పనిచేసినా రూ.200 కూలీ దొరకదని, తెలంగాణలో రోజుకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు సంపాదిస్తున్నామని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వానకాలం సీజన్లో ఏ ఊరిలో చూసినా ఉత్తరాది కూలీలే నాట్లు వేస్తూ కనిపిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే దాదాపు 30 వేల మంది వలస వస్తున్నట్టు ఓ అంచనా. స్థానిక కూలీల కంటే తక్కువ కూలీకే వలస కూలీలు పనికి వస్తుండటంతో రైతులు కూడా వారివైపే మొగ్గు చూపుతున్నారు.
తెలంగాణ రాకముందు.. ఎకరం, అరెకరం భూమిలో పంట వేసినా, గిట్టుబాటు కాదని, నీళ్లకు గోసవుతుందని చిన్న కమతాల రైతులు కూలీకి పోయేవాళ్లు. కానీ స్వరాష్ట్రం సిద్ధించాక సాగు నీటి సమస్య తొలగిపోయింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు సంక్షేమ ఫలాలు సన్నకారు రైతుల వరకూ చేరాయి. దీంతో వారంతా ఉన్న కాసింత భూమిలోనూ వ్యవసాయం చేయటం మొదలుపెట్టారు. కూలీకి పోయే అవసరం తప్పింది. సొంత భూమిలో పనిచేసుకొంటున్నామన్న తృప్తి దొరికింది.
తెలంగాణ మాదిరి పొరుగు రాష్ర్టాల్లో ప్రాజెక్టులు, కాల్వలు లేవు. అక్కడ ఏడాదికి ఒకే పంట పండుతుంది. అది కూడా వర్షాలు సరిగ్గా కురిస్తేనే. ఏటా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లోనే వారికి పని. మిగతా రోజుల్లో పస్తులే. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రకు చెందిన కూలీలు ఏడాదిలో 8 నెలలపాటు తెలంగాణలోనే ఉంటూ ఉపాధి పొందుతున్నారు. ఇక్కడిలా తమ రాష్ట్రం బీహార్లో పనులు ఉండవని సిపోల్ జిల్లాకు చెందిన రంజిత్ చెప్పారు. ఇక్కడ కట్టే పెద్ద పెద్ద బిల్డింగుల వద్దకు వెళ్లి ఇటుక, ఇసుక, కంకర మోసే పనులు గుత్తకు పట్టుకొంటామని వివరించారు.
తెలంగాణ వచ్చాక వ్యవసాయానికి ప్రాధాన్యం ఏర్పడింది. భవన నిర్మాణ రంగం ఒక్కసారిగా ఎగిసింది. స్థానిక కూలీలు లేక ఇతర రాష్ర్టాల కూలీల అవసరం పెరిగింది. ఇక్కడ ఉపాధి దొరుకుతుండటంతో కుటుంబాలకు కుటుంబాలే వలస వచ్చి ఇక్కడి భవన నిర్మాణ పనుల్లో పాలుపంచుకొంటున్నారు. ఈ పనుల్లో ఎక్కువగా బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం నుంచి వచ్చిన కూలీలు ఉంటున్నారు. సెంట్రింగ్ పనులు ఎక్కువగా బెంగాల్ కూలీలు చేస్తున్నారు. ఇటుక బట్టీల్లో ఒడిశా, మహారాష్ట్ర నుంచి వచ్చిన కూలీలకు పని దొరుకుతుంటే, రాజస్థాన్ నుంచి వచ్చిన కూలీలు మార్బుల్ పనులు చేస్తున్నారు. ఏ పనిలో చూసినా ఇతర రాష్ర్టాల కూలీలే కనిపిస్తున్నారు.
పస్తులుండి, పొద్దంతా కష్టం చేసి సంపాదించిన డబ్బును సొంతూరిలోని భార్యాపిల్లలకు పంపిస్తున్న ఎంతోమంది వలస కూలీలకు రూ.5 భోజనం వరంలా మారింది. రూ.5కే రుచికరమైన భోజనం దొరుకుతుండటంతో కడుపు నిండా తిని, రాత్రికి పార్సిల్ కట్టుకొని పోతున్నవాళ్లెందరో.
స్వరాష్ట్ర పాలనలో మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు వంటివి సాగు, తాగునీటికి ఢోకా లేకుండా చేశాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. అన్ని కాల్వల నీటి సామర్థ్యం పెరిగింది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు వంటి సంక్షేమ పథకాలు రైతుకు వరంగా మారాయి. రాష్ట్ర వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కింది. రైతుకు పుష్కలంగా సాగు నీరు అందటంతో మెట్ట భూములన్నీ పొలాలుగా మారాయి. దీంతో సాగు విస్తీర్ణం పెరిగింది.
ఒక్కో వలస కూలీ రోజుకు దాదాపు రూ.వెయ్యి దాకా సంపాదిస్తున్నాడు. ఎకరం పొలం నాటు వేస్తే రైతులు వారికి రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు చెల్లిస్తున్నారు. నారు పీకడం, నారు మోయడం, పంచడం లాంటి పనులు చేయిస్తున్నారు. వలస కూలీలకు ప్రతి పంట కాలంలో రెండు నెలల పాటు పని దొరుకుతున్నది. తమ రాష్ట్రంలో కూలీ గిట్టుబాటు కాదని, తెలంగాణలో ఇచ్చేది ఎక్కువేనని మహారాష్ట్రకు చెందిన వలస కూలీ అర్పల్ తెలిపారు. ఏటా యాసంగిలో నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం ప్రాంతానికి వస్తున్నామని, కలుపుతీత నుంచి పంటలు చేతికొచ్చేదాక ఉండి, పనిచేసుకొంటున్నామని వెల్లడించారు.
తెలంగాణల పనులకు ఇబ్బంది ఉండదు. పనులు దొరుకుతయ్. ప్రతి సంవత్సరం వానకాలం పంటలు సాగు చేసే సమయంలో వస్తం. వరి నాటు పనులు పూర్తయ్యేదాకా ఇక్కడే ఉంటం. పొలం గుత్తకు తీసుకొని 15 మందితో రోజుకు మూడు ఎకరాల వరకు నాటు వేస్తం.
– భజున్ బస్కే, బెంగాల్
మాది బీహార్ రాష్ట్రం. నేను డిగ్రీ చదివా. అక్కడ ఉపాధి లేక తెలంగాణలో ఉపాధి కోసం వచ్చా. ప్రస్తుతం నాట్లు వేస్తున్నా. చేతినిండా పని దొరుకుతున్నది. ఇక్కడ పని దొరక్కపోతే దుబాయ్ వెళ్లాల్సి వచ్చేది. ఇక్కడ సీఎం సార్ అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయి.
– సూరజ్ కుమార్, బీహార్
నాది ఉత్తరప్రదేశ్లోని బాల్యా జి ల్లా సికిందర్పూర్. రామగుండం ఆర్ఎఫ్సీఎల్ గ్యాస్ పైపులైన్లో పని చేస్తున్నా. యూపీ లో పని దొరక్క ఉపాధి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చిన. 28 రోజుల పనికి రూ.17 వేల జీతం ఇస్తున్నారు. పనికి తగ్గ జీతం దొరకటం సంతోషంగా ఉన్నది.
– రవికుమార్ చౌహాన్, యూపీ