నిజామాబాద్ : అనారోగ్యానికి గురైన ఓ వలస కార్మికుడు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత ఆర్థిక సహకారంతో స్వగ్రామం చేరాడు. జిల్లాలోని జక్రాన్పల్లి మండలం సికింద్రాపూర్కు చెందిన చెమ్మటి సాయికుమార్ ఉపాధి కోసం నాలుగేళ్ల కిందట దుబాయికి వెళ్లాడు. అక్కడ రెండు నెలల తర్వాత టీబీ సోకగా.. దీంతో అక్కడే ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. అయిన వారు ఎవరూ దగ్గర లేకపోవడంతో మానసిక కుంగిపోయాడు. అక్కడి మిత్రులు స్వగ్రామంలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
బాధితుడి తల్లి, కుటుంబ సభ్యులు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను కలిసి గోడును వెల్లబోసుకున్నారు. దుబాయి నుంచి సాయికుమార్ను స్వగ్రామానికి తీసుకురావాలని అభ్యర్థించారు. స్పందించిన ఆయన పరిస్థితిని ఎమ్మెల్సీ కవితకు దృష్టికి తేగా.. సాయికుమార్కు సహాయం అందించి స్వగ్రామానికి పంపేలా ఏర్పాటు చేయాలని దుబాయిలోని కిరణ్కుమార్, రాగం అరవింద్కు సూచించారు. దీంతో అరవింద్ హాస్పిటల్కు వెళ్లి సాయికుమార్ను కలిసి, వైద్యులతో మాట్లాడారు. వరుసగా మూడు పరీక్షల్లోనూ టీబీ నెగెటివ్ రావడంతో అలాగే కంపెనీ హెచ్ఆర్ విభాగంతో చర్చించారు.
దీంతో వీసా క్లియరెన్స్తో పాటు బాధితుడికి కంపెనీ నుంచి రావాల్సిన బకాయిలను సైతం ఇప్పించారు. ఆ తర్వాత ఇండియాకు వచ్చేందుకు విమానచార్జీలను సైతం ఎమ్మెల్సీ కవిత కార్యాలయం అందించింది. సొంత ఖర్చులతో సాయికుమార్ను స్వగ్రామానికి రప్పించడమే కాకుండా ఉపాధి, కంపెనీ నుంచి రావాల్సిన బకాయిలు ఇప్పించడంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు, ఎమ్మెల్యే బాజిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. స్వగ్రామం చేరుకున్న సాయికుమార్ను ఎమ్మెల్యే బాజిరెడ్డి బుధవారం పరామర్శించారు.