నిర్మల్ టౌన్, ఏప్రిల్ 11: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తున్న కూలీలకు కేంద్రం విధానాలు శాపంగా మారాయి. మండుటెండల్లో పని చేసే కూలీలకు టెంట్లు, తాగునీరు కల్పన వంటి సౌకర్యాలకు కేంద్రం చెక్ పెట్టడంతో కార్మికులు వడదెబ్బకు గురై అనారోగ్యం పాలవుతున్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని వడ్యాల్ నర్సాపూర్ గ్రామానికి చెందిన ఉపాధి కూలీ పడిగెల రవి వడదెబ్బకు గురై మృతి చెందాడు. మోదీ ప్రజావ్యతిరేక విధానాలకు రవి మృతిచెందిన ఘటనే నిదర్శనమని సర్వత్రా విమర్శలొస్తున్నాయి.
గతంలో తెలంగాణ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం.. గ్రామాల్లో ఉపాధి కూలీలకు చేతి నిండా పని కల్పించి.. పల్లెల అభివృద్ధికి కృషి చేసింది. పని ప్రదేశంలో కూలీలకు అవసరమయ్యే సౌకర్యాలు కల్పించింది. కానీ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చి కూలీలకు పని దక్కకుండా కుట్ర పన్నుతున్నది. ఎండాకాలంలో పనిచేసే వారికి గతంలో వేసవి భత్యంతోపాటు పని ప్రదేశంలో నీడ సౌకర్యం కోసం టెంట్లు, తాగునీరు, కూలీల పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేక సిబ్బంది, వైద్యం కిట్, గడ్డపార, పార, తట్ట తదితర వస్తువులకు బిల్లులు వచ్చేవి. రెండేండ్లుగా ఉపాధి కూలీలకు చేతినిండా పని కల్పించకపోగా టెంట్లు, తాగునీరు, వైద్యం కిట్, తదితర సౌకర్యాలను రద్దు చేసింది. ఫలితంగా కూలీలు మండుటెండల్లోనే పనులు చేస్తూ వడదెబ్బకు గురై కొందరు మృత్యువాత పడుతుండగా.. మరికొందరు అనారోగ్యం బారిన పడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే కడెం, సారంగాపూర్, తానూరు తదితర మండలాల్లో ఉపాధి కూలీలు ఎండల కారణంగా వడదెబ్బకు గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలో వేర్వేరు చోట్ల మంగళవారం వడదెబ్బకు గురై మరో ముగ్గురు మృత్యువాతపడ్డారు. బెల్లంపల్లి పట్టణంలో పండ్లు విక్రయించే లింగాల శ్రీనివాస్ (55) వడదెడ్బకు గురై మృతి చెందాడని ఆయన కుమారుడు రాజేశ్ తెలిపాడు. నెన్నెల మండలంలోని గంగారం గ్రామానికి చెందిన సల్లూరి లింగయ్య(70) ఉదయం తన మామిడి తోటకు వెళ్లి.. ఎండ తీవ్రతకు వరి పొలంలో కుప్పకూలి మృతి చెందాడు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ముద్దునూరు గ్రామశివారులో మండల కేంద్రానికి చెందిన ముప్పారపు సారయ్య(67) కూలీ పనికి వెళ్లి భానుడి ప్రతాపానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.