హైదరాబాద్/ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): దసరా సెలవులు, బతుకమ్మ పండుగ నేపథ్యంలో నాలుగువేలకు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు టీఎస్ఆర్టీసీ సమాయత్తమైంది. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్నిప్రాంతాలతోపాటు, ఇతర రాష్ర్టాలకు కూడా వీటిని నడపనున్నారు. అక్టోబర్ 8 నుంచి 14 వరకు స్పెషల్ సర్వీసులు తిరుగుతాయని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కలిపి 3,085 బస్సులు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ర్టాల్లోని ముఖ్య పట్టణాలకు మరో 950 స్పెషల్ సర్వీసులను నడపనున్నారు. దూరపు ప్రయాణ బస్సు ల్లో మాత్రమే రిజర్వేషన్ టికెట్లకు అదనపు చార్జీలు, ఇతర సర్వీసుల్లో సాధారణ చార్జీలు వసూలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. పండుగ రోజుల్లో రద్దీకి అనుగుణంగా సాధారణ బస్సుల్లో సీట్లు నిండిన తర్వాత స్పెషల్ బస్సుల రిజర్వేషన్లు ఓపెన్ చేయనున్నట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు. ప్రత్యేక బస్సుల నిర్వహణ కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఆరంఘర్, ఉప్పల్క్రాస్రోడ్డు, మియాపూర్, కుషాయిగూడ, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్తదితర ముఖ్యమైన పాయింట్లలో సీనియర్ అధికారులను నియమించనున్నారు.
హైదరాబాద్లోని దిల్సుక్నగర్, సెంట్రల్ యూనివర్సిటీ డిపోల నుంచి రాష్ట్రంలోని పలు పట్టణాలకు మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను నడపాలని హైదరాబాద్ నగర ప్రాంతీయ అధికారులు నిర్ణయించారు. శుక్రవారం నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ సిటీ రీజియన్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి హనుమకొండకు రూ.300, ఎంజీబీఎస్-మహబూబ్నగర్ రూ.200, ఎంజీబీఎస్-ఖమ్మం రూ.370, ఎంజీబీఎస్-మంచిర్యాలకు రూ.490 చొప్పున చార్జీలు వసూలు చేయనున్నట్టు పేర్కొన్నారు. సలహాలు, సూచనలను 99592 26160 నంబర్కు వాట్సప్ ద్వారా పంపించాలని సూచించారు.
ఆర్టీసీ సేవలు ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు సంస్థ కొత్త ఎండీ వీసీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏ నంబర్ బస్సు ఏ రూట్ వైపు వెళ్తుందో తెలిసేలా బస్టాపుల్లో సైన్బోర్డులను ఏర్పాటు చేయిస్తున్నారు. ఉదాహరణకు.. లక్డీకాపూల్ బస్టాప్ నుంచి కొండాపూర్ వెళ్లాలంటే ఏయే నంబర్ బస్సులు ఎక్కవచ్చో బోర్డుపై పేర్కొంటున్నారు. ఇదే విధానాన్ని సిటీ బస్సు సర్వీస్లు ఉన్న మిగిలిన పట్టణాల్లోనూ అమలు చేయనున్నట్టు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. హైదరాబాద్తోపాటు మిగిలిన పట్టణాల్లోనూ ముఖ్యమైన బస్టాప్లలో సైన్బోర్డులు ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టు సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. మరోవైపు, ప్రయాణికులను ఆకర్షించడంలో భాగంగా కొత్తదనం ఉండేలా బస్సుల రంగులను మార్చాలన్న యోచనలో ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉన్నట్టు సమాచారం.