హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): మోదీ పాలనంతా రైతులకు చీకటి రోజులేనని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు ఆరోపించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ.. ఎనిమిదేండ్లలో సాగు ఖర్చులను రెట్టింపు చేశారని శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శించారు. మోదీ విధానాలతో సాగు సంక్షోభంలో కూరుకుపోయిందని తెలిపారు. పొలం దున్నడం మొదలుపెడితే పంట అమ్ముకొనే వరకూ ఖర్చులన్నీ ఆకాశాన్నంటాయని చెప్పారు.
పంటలకు మద్దతు ధర ఇవ్వకుండా రైతులను వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బోరు బావులకు మీటర్లు పెట్టాలనుకోవడం దుర్మార్గమని, దేశమంతా వ్యతిరేకిస్తున్నా మోదీ ఎందుకు మీటర్లు పెడుతున్నారో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా అవతరించడం మోదీకి నచ్చడం లేదని ఆరోపించారు. తెలంగాణ రైతుల ధాన్యం కొనబోమంటూ కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు. మోదీ రైతు వ్యతిరేక విధానాలపై రాష్ట్ర బీజేపీ నేతల వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.