ఈ నెల 18న ఆవిష్కరించనున్న మంత్రి కేటీఆర్
దేశంలో మెటావర్స్ను వినియోగిస్తున్న తొలి రాష్ట్ర ప్రభుత్వం మనదే
మెటావర్స్.. నేటి ఆధునిక యుగంలో చాలా మంది నోట వినిపిస్తున్న మాట ఇదే. ఇదొక సరికొత్త సాంకేతిక మాయా లోకం. కంప్యూటర్పై సృష్టించిన కల్పిత ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించే వేదిక. భౌతికంగా లేకపోయినా అవతార్ల రూపంలో అందరూ ఒకేచోట, ఒకే వేదికపై పరస్పరం మాట్లాడుకొంటారు. చర్చలు, సమావేశాలు, రోజువారీ కార్యకలాపాలు సాగిస్తారు. భౌతిక ప్రపంచంలో చేసే పనులన్నీ మెటావర్స్ వేదికగా చేసుకోవచ్చు. ఈ అత్యాధునిక సాంకేతిక వేదికను తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి వినియోగించుకోనున్నది. రాష్ట్ర ఐటీ శాఖ కొత్తగా రూపొందించిన తెలంగాణ స్పేస్టెక్ పాలసీ ఆవిష్కరణకు మెటావర్స్ వేదికగా నిలువనున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఎంతో ముందంజలో ఉన్నది. ఎమర్జింగ్ టెక్నాలజీలకు దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనంత ప్రాధాన్యాన్ని ఇస్తున్నది. దీని కోసం తెలంగాణ ఐటీ శాఖ ఆధ్వర్యంలోని ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ ప్రత్యేకంగా పనిచేస్తున్నది. టెక్నాలజీ పరంగా ప్రపంచంలో వస్తున్న మార్పులను రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేసి, ప్రజలకు అత్యంత మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తున్నది. ఇప్పుడు యావత్ ప్రపంచం ‘హాట్ టాపిక్’గా మాట్లాడుకొంటున్న మెటావర్స్పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. తెలంగాణ స్పేస్టెక్ ప్రేమ్వర్క్ను ఆవిష్కరించేందుకు దేశంలోనే తొలిసారి మెటావర్స్ను వేదికగా ఉపయోగించుకోనున్నది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈనెల 18న ఈ పాలసీని ఆవిష్కరించనున్నారు.
ఎమర్జింగ్ టెక్నాలజీల్లో కీలకం
రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఎమర్జింగ్ టెక్నాలజీల్లో స్పేస్టెక్ కీలకమైంది. ఇప్పటికే పలు ప్రైవేటు సంస్థలు, స్టార్టప్ కంపెనీలు ఈ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. టీహబ్లోని స్టార్టప్లు సైతం స్పేస్ టెక్నాలజీ ఆవిష్కరణలతో రాకెట్ ప్రయోగాల్లో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఈ రంగానికి మరింత ప్రాధాన్యమిచ్చేందుకు రాష్ట్ర ఐటీ శాఖ తెలంగాణ స్పేస్టెక్ పాలసీని రూపొందించింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిలో మంత్రి కేటీఆర్ తనదైన ముద్ర వేశారు. ఎమర్జింగ్ టెక్నాలజీల్లో ఒకటైన కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను ఉపయోగించుకొనేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా మరో ఎమర్జింగ్ టెక్నాలజీ అయిన స్పేస్ టెక్ కోసం ప్రత్యేక ప్రేమ్వర్క్ను అమలు చేయనున్నారు. ఈ పాలసీని ప్రకటించేందుకు మెటావర్స్ టెక్నాలజీని వేదికగా ఎంచుకొన్నారు.
దేశంలో తొలిసారిగా..
ప్రభుత్వం అధికారికంగా ఒక పాలసీని విడుదల చేయాలంటే ప్రత్యేకంగా ఉన్నత స్థాయిలో సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. వివిధ రంగాలకు చెందిన నిపుణులు, ప్రభుత్వ అధికారులు, మీడియా సహా ఎంతో మంది పాల్గొనే ఇలాంటి సమావేశాలను నిర్వహించాలంటే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. దీనికి భౌతికంగా ఎన్నో వ్యయప్రయాసలు ఉంటాయి. ఇలాంటి వాటికి పుల్స్టాప్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి అత్యాధునిక మెటావర్స్ ప్లాట్ఫామ్ను వినియోగించుకోనున్నది.