హైదరాబాద్: బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్కు (Raja Singh) ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మెటా (Meta) షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలగించింది. ఆయన పేరుతో ఉన్న రెండు ఫేస్బుక్ పేజీలు, మూడు ఇన్స్టా అకౌంట్లను తొలగించింది. సోషల్ మీడియాలో ధ్వేష పూరిత ప్రసంగాలను వ్యాప్తి చేస్తున్నట్లు ఇండియా హేట్ ల్యాబ్ (IHL) నివేదిక వెల్లడించిన వారం తర్వాత మెటా ఈమేరకు చర్యలు తీసుకున్నది. తొలగించిన ఫేస్బుక్ గ్రూపుల్లో సుమారు 10 లక్షల మందికిపైగా సభ్యులు ఉండగా, ఇన్స్టా అకౌంట్లలో లక్షా 55 వేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు.
కాగా, 2020లోనే తన ప్లాట్ఫామ్స్ నుంచి రాజాసింగ్పై మెటా నిషేధం విధించింది. అయితే ఆయన మద్దతుదారులు కొత్త మార్గాల ద్వారా గ్రూపులు, పేజీలను సృష్టించారు. వాటిలో ఎప్పటికప్పుడు రాజాసింగ్కు చెందిన ప్రసంగాలు, కార్యాకలాపాలకు సంబంధించిన వివరాలు షేర్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఆయన రెచ్చగొట్టేలా పెట్టిన కొన్ని పోస్టులే నిషేధానికి కారణమని తెలుస్తున్నది.
2024 లోక్సభ ఎన్నికలు జరిగిన ఏప్రిల్, జూన్ నెలల మధ్య బీజేపీ సీనియర్ నాయకులు చేసిన 266 మైనారిటీ వ్యతిరేక ద్వేషపూరిత ప్రసంగాలు అధికారిక పార్టీ ఖాతాల ద్వారా యూట్యూబ్, ఫేస్బుక్ ఎక్స్ లలో ప్రత్యక్ష ప్రసారం చేశారని ఐహెచ్ఎల్ నివేదిక పేర్కొన్నది. ఫేస్బుక్లో పోస్ట్ చేసిన రాజా సింగ్ ద్వేషపూరిత ప్రసంగాల్లో 74.5 శాతం ద్వేషపూరితమని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఆయన చేసిన 32 హేట్ స్పీచుల్లో 22 ప్రత్యక్షంగా హింసకు ప్రేరేపించేవిలా ఉన్నాయని పేర్కొంది. ప్రధానంగా ముస్లింలు, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని ఆ ప్రసంగాలు ఉన్నాయని తెలిపింది. వాటిలో 16 స్పీచ్లను యూట్యూబ్లో, 13 ప్రసంగాలను ఫేస్బుక్లో అప్లోడ్ చేశారని వెల్లడించింది.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల నుంచి తన ఖాతాలను తొలగించడంపై రాజా సింగ్ ఎక్స్ వేదికగా స్పందించారు. హిందువులను లక్ష్యంగా చేసుకొని సెలెక్టివ్ సెన్సార్షిప్ దాడి చేస్తోంది. నా కుటుంబం, స్నేహితులు, కార్యకర్తలు, మద్దతుదారుల సోషల్ మీడియా ఖాతాలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేయడం దురదృష్టకరం. రాహుల్గాంధీ చేసిన ఫిర్యాదు ఆధారంగా నా అధికారిక ఖాతాలకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.