హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : పరీక్షల్లో పాసైతేనే ఎగిరి గంతేసే పరిస్థితులు పోయాయి. ఫస్ట్ క్లాస్లో పాసైతే ఘనంగా చెప్పుకునే రోజులు కూడా పోయాయి. ఇప్పుడు 90% మార్కులకు విద్యార్థులు సంతృప్తిచెందడంలేదు. చివరికి 988, 975 మార్కులొచ్చినా ఓర్చుకోవడంలేదు. ప్రత్యేకించి ఇంటర్ విద్యార్థులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. ఇంటర్ ఫలితాలు ఈ నెల 12న విడుదలయ్యాయి. ఈ సారి విద్యార్థులు భారీగా మార్కులు సాధించారు. కొందరు విద్యార్థులు ఒకటి రెండు మార్కులు తక్కువగా వచ్చినా అస్సలు సంతృప్తిచెందడంలేదు. తీవ్ర నిరాశలో మునిగితేలుతున్నారు. అనుకున్న మార్కులు రాలేదని, తక్కువ మార్కులు వచ్చాయి.. మా జీవితం వ్యర్థం.
ఇక అంతా ముగిసినట్టే అన్న భావనలో ఉన్నారు. దీంతో తల్లిదండ్రులకు టెన్షన్ తప్పడంలేదు. ఇటీవల సీబీఎస్ఈ ఫలితాల్లో కేరళ విద్యార్థికి ఒక్క మార్కు తక్కువగా వచ్చింది. 500 మార్కులకు 499 రాగా.. ఆ ఒక్క మార్కు కోసం రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకున్నది. అన్ని సబ్జెక్టుల్లో 100కు వంద మార్కులు రాగా, ఒక్క సైన్స్ సబ్జెక్టులో 100కు 99 మార్కులొచ్చాయి. అంతే ఒక్క మార్కు కోసం రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. విద్యార్థులు ఈ మార్కుల వేట నుంచి బయటపడాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.
వాస్తవానికి ఇంటర్ మార్కులతో ఉపయోగమే లేదు. ఎక్కడా ఈ మార్కులు పనిచేయవు. డిగ్రీలో చేరాలన్నా.. ఇంజినీరింగ్లో చేరాలన్నా ఈ మార్కులతో పనేలేదు. పాసైతే సరిపోతుంది. ఇది వరకు ఎప్సెట్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉండేది. గత కేసీఆర్ ప్రభుత్వం ఈ వెయిటేజీని తొలగించింది. జేఈఈలోనూ 12వ తరగతి మార్కుల వెయిటేజీని 2017లోనే ఉపసంహరించారు.