ముషీరాబాద్, జనవరి 20: సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా, పీసీసీ సీపీఐ(ఎంఎల్), సీపీఐ(ఎంఎల్) రివల్యూషనరీ ఇన్షియేటివ్ అనే మూడు విప్లవ పార్టీలు విలీనమయ్యాయి. రాజకీయపరమైన నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూ ప్రజల పక్షాన నిలవడమే లక్ష్యంగా మూడు పార్టీల నేతలు కలిసి సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ పార్టీగా ఏర్పడ్డారు.
శనివారం విద్యానగర్లోని మార్క్స్ భవన్లో మీడియా సమావేశంలో మూడు పార్టీల నేతలు కొత్త పార్టీ సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ పేరును ప్రకటించారు. మూడు పార్టీల నేతలు పోటు రంగారావు, గడ్డం సదానందం, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, కేజీ రాంచందర్, కే రంగారెడ్డి, కే రమ, ఆర్ చంద్రశేఖర్, వీ కృష్ణ, చండ్ర అరుణ, ఎం హన్మేశ్, ఎస్ఎల్ పద్మ కొత్త పార్టీ విధి విధానాలను వెల్లడించారు.
ఐదు దశాబ్దాలుగా దేశంలో, రాష్ట్రంలో ప్రజా సంఘాలుగా చురుకైన పాత్ర పోషించిన విప్లవ పార్టీలు ఒక్కపార్టీగా ఆవిర్భవించి ఐక్యతతో ముందుకు సాగబోతున్నట్టు తెలిపారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా, లౌకిక విలువలకు అనుకూలంగా పోరాటం చేయనున్నట్టు చెప్పారు. మూడు విప్లవ పార్టీలు ఒకే పార్టీగా ఆవిర్భవించిన నేపథ్యంలో మార్చి 3, 4, 5 తేదీల్లో ఖమ్మంలో ప్రజాప్రదర్శన, బహిరంగ సభ, ప్రతినిధుల సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు.