ఖమ్మం, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత ముంపు గ్రామాల పేరుతో ఆంధ్రప్రదేశ్లో కలిపిన భద్రాచలం మండలంలోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. సీఎం కేసీఆర్ ఈ గ్రామాలను తిరిగి సాధించుకునేందుకు ఓవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తుండటంతోపాటు మరో వైపు అవసరమైతే ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. దీంతో ఆ ఐదు గ్రామాల ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
2014 జూన్లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంతో అప్పటివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న కూనవరం, కుక్కూనూరు, చింతూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగా, భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో పాక్షికంగా పోలవరం ముంపు గ్రామాల పేరుతో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కలిపారు. సదరు మండలాలు, గ్రామాలను ఏపీలో కలిపే సమయంలో ఇక్కడి ప్రజల మనోభావాలు కానీ, తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా అశాస్త్రీయంగా కలిపారు. దీంతో ఇక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముంపు గ్రామాలను తిరిగి తెచ్చుకునేందుకు కేసీఆర్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ప్రధానంగా భ ద్రాచలం మండలంలోని పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, ఎటపాక, పురుషోత్తప ట్నం, గుండాల గ్రామాలను ఏపీలో కలిపే సమయంలో కనీస ప్రమాణాలు పాటించకపోవడంతో అక్కడి ప్రజలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
భద్రాచలం మండలం నుంచి ఏపీలో కలిపిన పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం గ్రామాలకు భద్రాచల ఆలయంతో ఆధ్యాత్మిక అనుబంధం ఉన్నది. ఎటపాకలో శ్రీరాముని జటాయివు మండపం ఉండగా, గుండాలలో సీతమ్మతల్లి కోసం నిర్మించినట్టు ఉష్ణగుండాలు ఉన్నాయి. ఇక భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామికి గల వ్యవసాయ భూముల్లో సుమారు 900 ఎకరాలు పురుషోత్తమపట్నంలో ఉన్నాయి. ఇంతటి చారిత్రక ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ నుంచి తిరిగి తెచ్చుకోవడానికి సీఎం కేసీఆర్ గత ఏడేండ్లుగా శ్రమిస్తుండగా కొంత సానుకూలత కనిపిస్తున్నది.
అప్పట్లో భద్రాచలం మండలంలో ఉన్న ఎటపాక గ్రామాన్ని ఏపీ ప్రభుత్వం మండల కేంద్రంగా ప్రకటించింది. ఇక భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు వెళ్లాలంటే ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో మండలంగా ఉన్న ఎటపాకను దాటి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. భద్రాచలం మండలంలోని సదరు ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ప్రసార మాధ్యమాల్లో రావడంతో ఆయా గ్రామాల ప్రజల్లో ఆశలు చిగురించాయి. మళ్లీ తెలంగాణలో కలుస్తామన్న భరోసా కలుగుతున్నది.
ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలి. కన్నాయిగూడేనికి చెందిన మా పిల్లలు చదువుకోవాలంటే ఎంతో దూరం వెళ్లాల్సి వస్తున్నది. కోర్టు, స్కూళ్లు, కాలేజీలు అన్నీ మాకు దూరమే. జిల్లా అధికారిని కలవాలంటే 360 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏపీలోని కాకినాడకు వెళ్లాల్సి వస్తుంది. ఏపీ సరిహద్దుకు చివరగా ఉండటంతో అభివృద్ధి లేకుండాపోయింది. ఇటీవల ఊర్లోని వారికి డెంగీ జ్వరాలు వస్తే ప్రైవేట్ దవాఖానకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సి వచ్చింది. వేలల్లో ఖర్చు పెట్టాల్సి వచ్చింది. -డేగల రామకృష్ణ, కన్నాయిగూడెం, (ఏపీలో విలీన గ్రామం)
ఏ అవసరం వచ్చినా మేం పక్కనే ఉన్న భద్రాచలం వెళ్తాం. ఇప్పుడు ప్రభుత్వపరంగా ఏ అవసరం వచ్చినా వందల కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తున్నది. దూరభారం కావడంతోపాటు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. రాముడు భద్రాచలం, రాముని భూములు ఆంధ్రాలో ఉన్నాయి. ఐటీడీఏ పీవోను కలవాలంటే చింతూరు వెళ్లాల్సి వస్తుంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మాకు తెలంగాణలో ఉంటేనే బాగుంటుందనిపిస్తుంది. -నక్కా నరసింహ, ఎటపాక (ఏపీలో విలీన గ్రామం)