కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 8: ఈ నెల 16న జేఎన్టీయూహెచ్ వర్సిటీలో మెగా జాబ్మేళా-2023 నిర్వహించనున్నట్టు వర్సిటీ వైస్ చాన్స్లర్ కట్టా నర్సింహారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు వర్సిటీ వీసీ చాంబర్లో శుక్రవారం జాబ్మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్సిటీ, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ, సేవా ఇంటర్నేషనల్ సంస్థల ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్మేళా-2023ను వర్సిటీ ఆవరణలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ జాబ్మేళాలో 100 కంపెనీలు పాల్గొంటాయని, 10 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు తెలిపారు. 10, ఇంటర్, డిప్లొమా, ఐఐటీ, బీటెక్, ఎంటెక్సహా డిగ్రీ, పీజీతోపాటు బీఫార్మసీ, ఎంఫార్మసీ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. 2016 నుంచి 2023 వరకు ఉత్తీర్ణులైన వారంతా అర్హులని తెలిపారు. ఐటీ, ఐటీఈఎస్, మేనేజ్మెంట్, ఫార్మా, కోర్, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, రిటైల్ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు తెలిపారు. నిరుద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని, ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదని తెలిపారు. కార్యక్రమంలో రెక్టార్ గోవర్ధన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ ఫౌండర్ సీఈవో సుభద్రరాణి, యూఐఐసీ డైరెక్టర్ తారా కళ్యాణి, డిప్యూటీ డైరెక్టర్ జే సురేశ్కుమార్, పీఆర్వో ప్రసన్న, వివిధ కంపెనీల సీఈవోలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.