మహబూబ్నగర్ : జులై 3న జిల్లాపరిషత్ మైదానంలో సుమారు అరవై కంపెనీలు మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో లక్షా 33,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మరోసారి రాష్ట్ర ప్రభుత్వం 80 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
వీటితోపాటు ప్రైవేటు కంపెనీలలో 15 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఆయన వెల్లడించారు. ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో సెట్విన్ ద్వారా ఇదివరకే నాలుగు జిల్లాలలో జాబ్ మేళాలు నిర్వహించామని, అదే తరహాలో మహబూబ్నగర్లో కూడా 3 వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ జాబ్ మేళాలో ఏడో తరగతి చదివిన వారు మొదలుకొని బీటెక్, బీఫార్మసీ చదివిన వారికి కూడా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సుమారు 60 కంపెనీలు జబ్ మేళాలో పాల్గొంటున్నాయని, ఈ విషయమై కంపెనీలతో కూడా మాట్లాడినట్లు మంత్రి వివరాలను వెల్లడించారు. జాబ్ మేళాకు ఎక్కువ మంది నిరుద్యోగులు హాజరయ్యేలా పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇక్కడే ఉపాధి కల్పిస్తామని మంత్రి తెలిపారు. పరిశ్రమలతో పాటు, అభివృద్ధి విషయంలో, భారత్ మాల రహదారి విషయంలో కూడా కొంతమంది అడ్డుపడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు.