Mega DSC | నల్లగొండ: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ ప్రకటించి త్వరలోనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని రాష్ట్ర ఆర్అండ్బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి గ్రూప్-2 పరీక్షను కూడా నిర్వహిస్తామన్నారు. పకడ్బందీగా పోటీ పరీక్షలు నిర్వహించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. రాబోయే క్యాబినెట్ సమావేశంలో చర్చించి త్వరలోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం కూడా అందజేస్తామని వెల్లడించారు. నల్లగొండ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఇక నుంచి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెకులతో పాటు పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర ప్రభుత్వ పథకాల్లో అధికారులే పారదర్శకంగా అర్హులను ఎంపిక చేస్తారని చెప్పారు. రానున్న రోజుల్లో ఆరు గ్యారెంటీలను 100 శాతం అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.