హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ బాధ్యతల నుంచి మీనాక్షీనటరాజన్ త్వరలోనే తప్పుకోనున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ పూర్తి కాగానే ఆమె తెలంగాణకు వీడోలు పలుకనున్నారని సమాచారం. రానున్న కాలంలో ఆమెను పంజాబ్ రాష్ట్ర ఏఐసీసీ దూతగా పూర్తిస్థాయి బాధ్యతల్లోకి పంపేందుకు అధిష్ఠానం రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది.
కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై మీనాక్షీనటరాజన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు గాంధీభవన్ శ్రేణుల్లో చర్చ నడుస్తున్నది. గతంలో తాను రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యే అవకాశం దకకుండా రాష్ట్రానికి చెందిన కొందరు కీలక నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించి వెన్నుపోటు పొడిచారనే అసహనం ఆమెలో గూడుకట్టుకొని ఉన్నదని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో కొనసాగడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని ఆమె ఇప్పటికే అగ్రనేత రాహుల్గాంధీ వద్ద స్పష్టంచేసినట్టు ప్రచారం జరుగుతున్నది.
మరోవైపు, పంజాబ్ రాజకీయాలపై ఏఐసీసీ ప్రత్యేక దృష్టి సారించింది. అకడ నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ అంతర్గత పరిస్థితులను క్షేత్రస్థాయిలో సమీక్షించి అధిష్ఠానానికి నివేదిక సమర్పించేందుకు ఏఐసీసీ ముగ్గురు సభ్యుల పరిశీలకుల బృందాన్ని నియమించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు ఏర్పాటైన ఈ పరిశీలకుల కమిటీలో మీనాక్షీనటరాజన్తోపాటు సీనియర్ నేత అజయ్మాకెన్, భజన్లాల్ జాతవ్ ఉన్నారు. ఇప్పటికే పంజాబ్ రాజకీయ సమీక్షలతో ఆమె పూర్తిగా బిజీ అయిపోయారు. తెలంగాణలో చేపట్టిన కీలక ‘సర్’ ప్రక్రియ ముగిసిన వెంటనే ఆమె పూర్తిస్థాయిలో పంజాబ్ కాంగ్రెస్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తున్నది.