జ్యోతినగర్, నవంబర్ 27: పెద్దపల్లి జిల్లా రామగుండంలో దారుణ హత్య జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో ఓ వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరికేశారు. తల, ఎడమ చెయ్యి ఒక దగ్గర, మొండెం మరోచోట లభించింది. ఈ ఘటన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎన్టీపీసీ ఖాజిపల్లికి చెందిన కాంపెల్లి శంకర్ (36), హేమలత దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. శంకర్ గోదావరిఖనిలోని మీసేవ సెంటర్లో ఆపరేటర్గా పనిచేస్తుండగా, హేమలత ఎన్టీపీసీ ధన్వంతరి దవాఖానలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నది. హేమలతకు నైట్డ్యూటీ ఉండటంతో గురువారం రాత్రి ఆమెను బైక్పై దవాఖాన వద్ద దింపేందుకు వెళ్లి తిరిగి రాలేదు. తన కొడుకు కన్పించడం లేదని శంకర్ తల్లి పోచమ్మ శుక్రవారం ఎన్టీపీసీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన కోడలిపైనే అనుమానం ఉన్నదని పేర్కొంది. శంకర్ ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులకు శనివారం ఉదయం ఎన్టీపీసీ కూలింగ్ టవర్ల దగ్గర తల, ఎడమ చెయ్యి లభించగా, సాయంత్రం గంగానగర్ శివారులో మొండెం దొరికింది. మృతుడి భార్య హేమలత, మామ, బావమరిదిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు గురువారం రాత్రే పదునైన ఆయుధాలతో శంకర్ను నరికి చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసిందని అనుమానిస్తున్నారు.