కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 7: తెలంగాణకు జీవధార అయిన మేడిగడ్డ బరాజ్ను వెంటనే పునరుద్ధరించి, సాగుకు నీరందించాలని బీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీపీలు డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జడ్పీ సర్వ సభ్య సమావేశంలో గళమెత్తారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావస్తున్నా రైతుల సమస్యలు పట్టించుకోవడంలో నిర్లక్ష్యం చూపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి నెలకు ముందే కరీంనగర్ జిల్లాలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం సరికాదని అన్నారు. కాంగ్రెస్కు బీఆర్ఎస్పై ఉన్న కోపాన్ని రైతులకు రుద్దుతున్నదని, ఫలితంగా చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని ధ్వజమెత్తారు. మేడిగడ్డ బరాజ్ మరమ్మతులపై దృష్టి పెట్టకపోవడంతోనే సాగునీటికి తిప్పలు వచ్చాయని ఆరోపించగా, కాంగ్రెస్ జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ జోక్యం చేసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. దీంతో ఇరు పార్టీలకు చెందిన జడ్పీటీసీల మధ్య వాగ్వావాదం చోటుచేసుకున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పలువురు బీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీపీలు పోడియం ఎదుట బైఠాయించారు. ప్రజా సంక్షేమం వీడి స్వలాభం కోసం పార్టీలు మారుతున్న నాయకులు తమను విమర్శించడం సరికాదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ, సమావేశం నుంచి వాకౌట్ చేశారు. జడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజయ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఈవో శ్రీనివాస్, వివిధ ప్రభుత్వ విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ను కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం గురువారం పరిశీలించింది. ఉదయం 8 గంటలకు మేడిగడ్డలోని ఎల్అండ్టీ సంస్థ క్యాంప్ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి బరాజ్కు సంబంధించిన అంశాలపై చర్చించారు. 9.30 గంటలకు మేడిగడ్డ బరాజ్ వద్దకు చేరుకొని కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. బరాజ్ డిజైన్, నిర్మాణం, లోపాలపై అధ్యయనం చేశారు. అక్కడి నుంచి మహారాష్ట్ర వైపు ఉన్న బరాజ్ ఏడో బ్లాక్లో కుంగిన 19, 20, 21వ పియర్ల దిగువ భాగాన్ని పరిశీలించారు. కుంగిన పియర్ల వద్ద ఉన్న గేట్ల పరిస్థితిని పరిశీలించారు. బరాజ్లో సమస్యలు తలెత్తకుండా చేపట్టాల్సిన పునరుద్ధరణ పనులపై చర్చించారు. బృం దంలో చంద్రశేఖర్ అయ్యర్తోపాటు సెంట్రల్ వాటర్, పవర్ రిసెర్చ్ స్టేషన్ సైంటిస్ట్ ఆర్ పాటిల్, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రిసెర్చ్ స్టేషన్ సైంటిస్ట్ యూసీ విద్యా ర్థి, సీడబ్ల్యూసీ బీసీడీ డైరెక్టర్ శివకుమార్, గేట్స్, సీడబ్ల్యూసీ, డిజాస్టర్ అండ్ రిసిలెయెన్స్ డైరెక్టర్ రాహుల్ కుమార్ ఉన్నారు.