మేడిగడ్డ బరాజ్ ఏడో బ్లాక్లోని 20వ పిల్లర్ వద్ద సీకెంట్ పైల్స్లో వాటిల్లిన లోపం కారణంగా పునాది కింది నుంచి నీరు ప్రవహించి ఇసుక, మట్టి కోతకు గురైంది. దీనివల్ల ఖాళీ (బొయ్యారం) ఏర్పడి పిల్లర్ కుంగింది. మొత్తం 8 బ్లాకుల్లో ఏడో బ్లాక్ మినహా అన్నీ సురక్షితంగానే ఉన్నాయి.
ఈఆర్టీ, జీపీఆర్ పరీక్షల్లో తేలిన నిజమిది..
Medigadda Barrage | హైదరాబాద్, మే25 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ పూర్తి భద్రంగానే ఉన్నది. ఇందులో ఏడో బ్లాక్ మినహా మిగిలిన ఏడు బ్లాకులన్నీ సురక్షితంగా ఉన్నాయి. ఈ నెల 23న సాయంత్రం 16వ నంబర్ గేటు ఎత్తే సందర్భంలో భారీ శబ్దాలు వచ్చి 20వ పిల్లర్ ముందు భాగంలో పెద్ద గొయ్యి పడిందని, అది బరాజ్ కింది దాకా ఉన్నట్టు అనిపిస్తున్నదని, ఒక చివరి నుంచి మరో చివరి దాకా పెద్ద అగాధంలా ఏర్పడి ఉంటుందని కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది.
ఇలాంటి అసత్య ప్రచారాలతో జరిగిన రాద్ధాంతంపైనా ఇంజినీర్లలో అసహనం వ్యక్తమైంది. బరాజ్ వద్ద శబ్దాలు, అగాధమని ప్రచారం కావడంతో నిపుణుల కమిటీ నిజానిజాలను వెల్లడించింది. సీకెంట్ పైల్స్ లోపం వల్లే ఏడో బ్లాక్ రాఫ్ట్ (పునాది) కింద ఇసుక కొంత మేర కొట్టుకుపోయిందని, ఫలితంగానే 20వ పిల్లర్ కుంగిందని, ఆ బ్లాక్ వద్ద ఏర్పడింది బొయ్యారం మాత్రమేనని, అగాధం ఏమాత్రం కాదని, ఇది మినహా బరాజ్ మొత్తంలో ఎక్కడా సాంకేతిక లోపాలు లేవని తేల్చింది.
బరాజ్ నిర్మాణ ఏజెన్సీ చేయించిన ఎలక్ట్రోడ్ రెసిస్టివిటీ (ఈఆర్టీ), గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ టెస్ట్ నివేదికల్లో ఇది వెల్లడైంది. ఇసుక, సిమెంట్ గ్రౌటింగ్ చేసి బరాజ్ను తాత్కాలికంగా వినియోగించుకునేందుకు అడ్డంకులు లేవని అధికారవర్గాలు సైతం వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ బరాజ్ రక్షణకు పలు సిఫారసులు చేయగా, ఆ మేరకు పనులు సైతం కొనసాగుతున్నాయి. వానలు పడేలోగా ఇవి పూర్తిచేయాలని అధికారయంత్రాంగం లక్ష్యం పెట్టుకున్నది.
మేడిగడ్డ బరాజ్లో మొత్తం 8 బ్లాక్లున్నాయి. వీటన్నిటిలో మొత్తం 85గేట్లున్నాయి. ఇందులో ఏడో బ్ల్లాక్లోని 20వ పిల్లర్ కుంగుబాటు కారణాలను తెలుసుకునేందుకు ఇంజినీరింగ్ అధికారులు గతంలోనే చర్యలు చేపట్టారు. అన్వేషణ ప్రక్రియను నిర్మాణ ఏజెన్సీ సంస్థ అయిన ఎల్అండ్టీనే చేపట్టింది. అదేవిధంగా ఐఐటీ రూర్కి సంస్థ కూడా అధ్యయనం చేసింది.
ముందుగా కుంగుబాటునకు గురైన ఏడో బ్లాక్ వద్ద ఈఆర్టీ చేసింది. విద్యుత్ నిరోధకత ఆధారంగా చేసే భూగర్భ పరీక్ష ఇది. విద్యుత్ ప్రవాహమనేది అన్నింట్లోనూ ఒకే విధంగా ఉండదు. ఇసుకలో ఒకలా, నీటిలో ఒకలా, ఒక్కో లోహంలో ఒక్కో వేగంతో విద్యుత్ ప్రవాహం ఉంటుంది. కొన్ని మూలకాల నుంచి విద్యుత్ అసలే ప్రవహించదు. ఇలా విద్యుత్ ప్రవాహాన్ని బట్టి భూగర్భంలో ఎలాంటి పదార్థమున్నదో తెలుసుకోవచ్చు. అదే పద్ధతిని అనుసరించి బరాజ్ ఫౌండేషన్ను అధికారులు పరీక్షించారు.
తర్వాత భూగర్భ భౌతిక స్థితిని తెలుసుకునేందుకు జీపీఆర్ నిర్వహించారు. భూగర్భంలో వివిధ మట్టి పొరలు, పదార్థాల లక్షణాలు, సంభవించిన మార్పులు, పగుళ్లు, శూన్యాలను తెలుసుకునేందుకు ఈ టెస్ట్ చేస్తారు. ఏడో బ్లాక్లో ఈ రెండు పరీక్షలు పూర్తి చేసి, ఆరో బ్లాక్లోనూ నిర్వహించారు. తర్వాత బరాజ్లోని అన్ని బ్లాకుల్లోనూ టెస్టులు చేశాక ఏడో బ్లాక్ మినహా అన్నీ భద్రంగానే ఉన్నాయని తేలింది. ఏడో బ్లాక్లోనూ 20వ పిల్లర్ రాఫ్ట్ కింద మినహా మరేచోటా సాంకేతిక లోపాలు లేవని నివేదించింది.
ఏడో బ్లాక్ పునాది కింద బొయ్యారం
ఏడో బ్లాక్ పునాది కింద 1000 క్యూబిక్ మీటర్ల బొయ్యారాన్ని గుర్తించినట్లు తెలిసింది. అంతర్గత జల ప్రవాహం వల్ల బరాజ్ ఫౌండేషన్ కింద మట్టి కొట్టుకుపోకుండా సీకెంట్ పైల్స్ ఏర్పాటు చేస్తారు. ఏడో బ్లాక్ 20వ పిల్లర్ వద్ద సీకెంట్ పైల్స్లో వాటిల్లిన లోపం కారణంగా ఫౌండేషన్ కింది నుంచి నీరు ప్రవహించి ఇసుక, మట్టి కోతకు గురైందని, దీనిద్వారా ఖాళీ ఏర్పడి పిల్లర్ కుంగిందని ప్రాథమికంగా గుర్తించారు. 20 పిల్లర్ పునాది కింది బొయ్యారాన్ని సిమెంట్, ఇసుక మిశ్రమంతో నింపడం ద్వారా లీకేజీని అరికట్టవచ్చని అధికారులు వివరిస్తున్నారు.
మరోసారి అధ్యయనం
నిర్మాణ ఏజెన్సీ ఈఆర్టీ, జీపీఆర్ టెస్టులు నిర్వహించగా, ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసులతో మరోసారి బరాజ్లోని సాంకేతిక లోపాలపై పలు సంస్థలతో అధ్యయనం చేయించేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమవుతున్నది. సీడబ్ల్యూపీఆర్ఎస్ , సీఎస్ఎంఆర్ఎస్, ఎన్జీఆర్ఐ తో సంప్రదింపులు జరుపుతున్నది. త్వరలోనే ఎన్జీఆర్ఐ బృందం రానున్నట్లు సమాచారం.
మొదలైన రక్షణ పనులు..
ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల రక్షణకోసం నీటిపారుదల అధికారులు చర్యలు చేపట్టారు. 20వ పిల్లర్, దానికిరువైపులా ఉన్న పిల్లర్ల గేట్లను ఎత్తాల్సి ఉన్నది. రాఫ్ట్ కింద ఉన్న బొయ్యారాన్ని గ్రౌటింగ్ చేసేందుకు చర్యలు చేపట్టారు. రాఫ్ట్ పైభాగంలో బోర్హోల్స్ వేయడం ప్రారంభించారు. బరాజ్ ఎగువ, దిగువన ఉన్న సీసీ బ్లాక్లను కూడా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. వానలు పడేలోగా తాత్కాలిక రక్షణ చర్యలు చేయనున్నారు.
ఎన్డీఎస్ఏ సిఫారసుల్లోని పనులపై సమీక్ష
ఎన్డీఎస్ఏ సిఫారసు చేసిన పనుల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీ వేసిన విషయం తెలిసిందే. చైర్మన్ ఈఎన్సీ (జనరల్) అనిల్కుమార్, సభ్యులు ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేందర్రావు, సీఈ (సీడీవో), మెంబర్ కన్వీనర్ రామగుండం సీఈ సుధాకర్రెడ్డితో కూడిన కమిటీ శనివారం ప్రత్యేకంగా సమావేశమైంది. హైడ్రాలజీ, ప్లానింగ్ ఎక్స్పర్ట్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ శశిధర్ను సైతం సమావేశానికి ఆహ్వానించింది.
మధ్యంతర సిఫారసుల అమలుపై చర్చించింది. వానకాలం ప్రారంభంలోగా తాత్కాలిక రక్షణ చర్యలు పూర్తిచేయాలని నిర్ణయించింది. సాంకేతిక లోపాలపై అధ్యయనం పూర్తయ్యాక పునరుద్ధరణ చేపట్టాలని అభిప్రాయపడింది. వానకాలం వచ్చేనాటికి చేపట్టాల్సిన పనులను అంశాల వారీగా చర్చించి ఈ మేరకు ఏజెన్సీలకు సూచించింది. పనుల పర్యవేక్షణకు ఈఎన్సీ (జనరల్) అనిల్కుమార్ మేడిగడ్డకు సోమవారం వెళ్లనున్నారు.
వారాంతంలో మేడిగడ్డకు ముఖ్యమంత్రి
మేడిగడ్డ బరాజ్ను సీఎం రేవంత్రెడ్డి వారాంతంలో సందర్శించనున్నట్లు సమాచారం. ఎన్డీఎస్ఏ మధ్యంతర సిఫారసుల అమలుపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఇటీవల ఆయన సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్వయంగా వచ్చి పనులను పరిశీలిస్తానని అధికారులతో వెల్లడించారు. వారాంతంలో బరాజ్ పనులను పరీలించనున్నట్లు సమాచారం.
‘మేడిగడ్డ’ టెస్టులకు 2.46 కోట్లు
మేడిగడ్డ బరాజ్లో వివిధ టెస్టుల కోసం ప్రభుత్వం రూ.2.46 కోట్లు మంజూరు చేసింది. కుంగిన ఏడో బ్లాక్తో పాటు మిగతా బ్లాకుల్లో ఎలాంటి లోపాలున్నాయి? వానకాలంలో నీటి ప్రవాహం వస్తే తట్టుకుంటాయా?, ఎలాంటి మరమ్మతులు చేయాలి? అనే విషయాలను తేల్చేందుకు ప్రభుత్వం నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసర్చ్ స్టేషన్) బృందం మేడిగడ్డ బరాజ్ను పరిశీలించి వెళ్లింది.
జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ సైంటిస్ట్ జేఎస్ ఎడ్లబడ్కర్, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ సైంటిస్ట్ డాక్టర్ ధనుంజయ్నాయుడు, నాన్ డిస్ట్రిక్టివ్ పరీక్షల నిపుణుడు ప్రకాశ్ పాలె మేడిగడ్డ బరాజ్ను పరిశీలించి వెళ్లారు. ఇప్పుడు ఢిల్లీకి చెందిన సీఎస్ఎంఆర్ఎస్ సంస్థ జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్, బ్లాక్ 7 లో కాంక్రీట్ స్ట్రక్చర్ ఇన్వెస్టిగేషన్ చేయనుంది. సైంటిస్టు హరిదేవ్ ఆధ్వర్యంలో బృందం త్వరలో మేడిగడ్డను పరిశీలించనుంది. ఫీల్డ్ అండ్ లేబొరేటరీ పరీక్షలు, డిజైన్, ప్రిపరేషన్ ఆఫ్ డ్రాయింగ్, ఎస్టిమేట్స్ ఆఫ్ సివిల్తోపాటు బరాజ్ మట్టి నమూనాల పరీక్షలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
సంస్థ లోపాలుంటే మొత్తం పనులు ఎల్అండ్టీతోనే!
ఆదినుంచీ ఎల్అండ్టీకి, ప్రభుత్వానికి మధ్య మరమ్మతుల విషయంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. నిధులు మంజూరు చేస్తేనే మరమ్మతులు చేస్తామని ఎల్అండ్టీ చెబుతూవస్తున్నది. బరాజ్ కుంగిన సమయంలో మరమ్మతుల బాధ్యత మాదే అని ఎల్అండ్టీ ప్రకటించి, అనంతరం మాట మార్చింది. దీంతో లోపాల గుర్తింపు పరీక్షలకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తున్నది. అందుకే నిధులు మంజూరు చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. పరీక్షల్లో ఎల్అండ్టీ నిర్మాణ లోపం బయటపడితే మరమ్మతులు మొత్తం ఆ సంస్థతోనే చేయించేందుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
కొనసాగుతున్న మరమ్మతులు
మేడిగడ్డ బరాజ్ ఏడో బ్లాక్లో కుంగిన పియర్ పునాది కింద ఏర్పడ్డ ఖాళీ ప్రదేశాలను సిమెంట్తో గ్రౌటింగ్ చేసేందుకు బోర్హోల్ పనులను శనివారం ప్రారంభించారు. పనులను భారీ నీటిపారుదల శాఖ ఈఈ తిరుపతిరావు, డీఈఈ సూర్యప్రకాశ్ పరిశీలించారు. మహారాష్ట్ర వైపు నుంచి ఏడో బ్లాక్ వరకు కాఫర్ డ్యాం నిర్మాణం చేపడుతున్నారు. మొత్తం ఎనిమిది బ్లాక్లలో డౌన్స్ట్రీమ్ పొడుగున ఉన్న సీసీ బ్లాక్లను సరిచేందుకు క్రేన్సాయంతో బయటకుతీస్తున్నారు. కుంగిన పియర్ల సమీపంలో బరాజ్ దిగువన ఊటల వల్ల చేరిన నీటిని యంత్రాలతో బయటికి పంపిస్తున్నారు. ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఇసుకను తొలగిస్తున్నారు.
కాళేశ్వరంపై ఇరిగేషన్ ప్రతిపాదనలు పక్కకు!
కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను అధ్యయనం చేసేందుకు నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఇరిగేషన్శాఖ చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం పక్కనపెట్టినట్టు సమాచారం. ప్రాజెక్టుపై విచారణకు ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో న్యాయవిచారణ కమిషన్ను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురి పేర్లను నిపుణుల కమిటీకి సూచిస్తూ ఇరిగేషన్శాఖ ప్రతిపాదనలు చేసింది.
ఫీల్డ్ ఎక్స్పర్ట్గా, కన్వీనర్గా విశ్రాంత చీఫ్ ఇంజినీర్ శ్రీకాంత్, సివిల్ (స్ట్రక్చరల్) ఎక్స్పర్ట్గా జేఎన్టీయూ ఎమిరిటస్ ప్రొఫెసర్, నిట్ వరంగల్ విశ్రాంత ప్రొఫెసర్ సీబీ కామేశ్వర్రావు, మెకానికల్ ఎక్స్పర్ట్గా విశ్రాంత సీఈ సత్యనారాయణ, జియో టెక్నికల్ ఎక్స్పర్ట్గా వరంగల్ నిట్ ప్రొఫెసర్ రమణమూర్తి, హైడ్రాలజీ, ప్లానింగ్ ఎక్స్పర్ట్గా ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ శశిధర్ పేరును ప్రతిపాదించింది. కమిటీలో ఇరిగేషన్శాఖలో గతంలో విధులు నిర్వర్తించిన ఇంజినీర్లను ప్రతిపాదించటం ఏమిటన్న ప్రశ్నలు ఆ శాఖ అధికారులే లేవనెత్తారు.
మేడిగడ్డ బ్రిడ్జిపై నిలిచిన రాకపోకలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బ్రిడ్జిపై శనివారం వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో ఓ నిండు గర్భిణి విలవిలలాడింది. ఎల్టీ సంస్థ మేడిగడ్డ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేడయంతో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల ప్రజలు వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. బరాజ్ మెయిన్ గేటు ఎదుట గంటల తరబడి నిరీక్షించారు.
మహారాష్ట్రలోని పోచంపల్లి గ్రామానికి చెందిన నిండు గర్భిణి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు బరాజ్ గుండా దవాఖానకు వెళ్తుండగా, ఎనిమిదో బ్లాక్ మెయిన్ గేటు వద్ద ఎల్టీ సంస్థ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఎంత మొర పెట్టుకున్నా కనికరించలేదు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు గేటు ముందు ఆందోళనకు దిగారు. దీంతో ఎల్టీ సంస్థ ప్రతినిధులు స్పందించి గేట్లను తెరిచారు. ద్విచక్రవాహనదారులు, పాదచారులు బ్రిడ్జిపై నుంచి వెళ్లేందుకు అనుమతినిచ్చారు.