సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
హైదరాబాద్, మార్చి 27 : కేంద్రప్రభుత్వం 850 రకాల ఔషధ ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చడానికే మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకొన్నదని మండిపడ్డారు. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్, డీజిల్, వంట నూనెలు, నిత్యావసరాల ధరలను భారీగా పెంచడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు. దీనికితోడు ఔషధ ధరలు పెంచితే ప్రజలపై అదనపు భారం వేయడమే అవుతుందని తెలిపారు. అంతేగాక బీపీ, షుగర్, గుండెజబ్బులకు సంబంధించి దీర్ఘకాలిక మందులు వాడే సామాన్య ప్రజలు వైద్యానికి దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.