న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహించారు. శనివారం ఉదయం ఈడీ కేంద్ర కార్యాలయం పరివర్తన్ భవన్కు వెళ్లిన మహిళా డాక్టర్ల బృందం.. జాగృతి అధ్యక్షురాలికి వైద్య పరీక్షలు చేశారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లోని ఆమె ఇంటి వద్ద అరెస్టు చేసిన ఈడీ అధికారులు.. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఢిల్లీలోని తమ కార్యాలయానికి తరలించిన విషయం తెలిసిందే. ఎయిర్పోర్టు వద్ద కవిత మీడియా కంటపడకుండా ఈడీ అధికారులు ఆమెను వేరే గేటు గుండా తమ కార్యాలయానికి తరలించారు. ఇక పరివర్తన్ భవన్ వద్ద 144 సెక్షన్ విధించారు. ఈడీ కార్యాలయంలో కవితను ప్రత్యేక సెల్లో ఉంచారు. అక్కడే వైద్య బృందం ఆమెకు పరీక్షలు నిర్వహించింది.
ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ న్యాయస్థానంలో కవితను ప్రవేశపెట్టనున్నారు. న్యాయస్థానం కవితను ఈడీ కస్టడీకి ఇస్తుందా.. లేదా అన్నది చూడాలి. ఒకవేళ ఈడీ కస్టడీకి ఇవ్వకపోతే 14 రోజుల రిమాండ్ విధించే అవకాశం ఉన్నది. కాగా, తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ వేయనున్నట్టు తెల్సింది. ఈ మేరకు ఆమె న్యాయవాదుల బృందం బెయిల్ పిటిషన్ను సిద్ధం చేస్తున్నది.