కొనసాగుతున్న ప్రత్యేక వైద్య శిబిరాలు
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): వరదలతో ప్రభావితమైన 8 జిల్లాల్లో ఆరోగ్య సేవలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలను క్లస్టర్లుగా విభజించి, ఈ నెల 16 నుంచి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరం ఉన్న వారి నమూనాలు సేకరించి ల్యాబ్లకు పంపిస్తున్నారు. గురువారం నాటికి ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా స్క్రీనింగ్ చేసిన వారి సంఖ్య లక్ష దాటింది. జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో బాధపడుతున్నవారిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
వారికి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ పరీక్షలు చేస్తున్నారు. అవసరమైతే దవాఖానకు రెఫర్ చేస్తున్నారు. ఇప్పటివరకు 38 మందిని ప్రభుత్వ దవాఖానకు రెఫర్ చేశారు. కొవిడ్ లక్షణాలతో ఉన్నవారికి పరీక్షలు చేసి, పాజిటివ్ వస్తే వెంటనే కిట్ అందజేస్తున్నారు. మరోవైపు ఇంటింటి జ్వర సర్వే కొనసాగుతున్నది. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, క్లోరిన్ ట్యాబ్లెట్లను వైద్య సిబ్బంది పంపిణీ చేస్తున్నారు.