మిర్యాలగూడ : కరోనా కట్టడి కోసమే ఇంటింటి జ్వర సర్వే చేపడుతున్నట్టు శాసనమండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. ఆదివారం ఫీవర్ సర్వే క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని 36వ వార్డు షాబూనగర్ లో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి వారు పర్యటించారు.
ఫీవర్ సర్వే బృందాల పనితీరును స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఫీవర్ సర్వే కోసం వైద్య, ఆరోగ్య, పంచాయతీ, పురపాలక శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. థర్డ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లను సిద్ధం చేసిందన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 21 నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఫీవర్ సర్వే నిర్వహిస్తోందన్నారు. కరోనా రెండో వేవ్ లోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జ్వర సర్వే అద్భుత ఫలితాలను ఇచ్చిందన్నారు.
గతేడాది మే 6న నిర్వహించిన జ్వర సర్వే కారణంగా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, ముందుచూపు ఫలితంగా కేసుల సంఖ్య 50 శాతం తగ్గిందన్నారు. కరోనా థర్డ్ వేవ్ లోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం కారణంగా ఇంటి వద్దకే వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు.
జ్వర సర్వే కు ప్రజలు సహకరించాలని వారు కోరారు. కరోనా కొత్త వేరోయిట్ ఒమిక్రాన్ విషయంలో భయాందోళనలు విడనాడాలని సూచించారు. అధిక ఖర్చు పెట్టుకుని ప్రయివేటు దవాఖానలకు పోవద్దని ప్రజలను కోరారు.