సూర్యాపేట: తెలంగాణ సమాజం ఆరోగ్యవంతంగా ఉండేందుకు వైద్యరంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మెడికల్ కళాశాలలో వైట్ కోట్ ఉత్సవం లో పాల్గొని వైద్య విద్యార్థులకు వైట్కోటులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం బాగుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నారని అన్నారు.
ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో భాగస్వామ్యమై కేసీఆర్ కలలను నిజం చేయాలని అన్నారు. వైద్యానికి ఆమడ దూరంలో ఉన్న సూర్యాపేట ను మెడికల్ హబ్ గా చేసిన ఘనత కేసీఆర్ దే అని అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వైద్య విద్యలో ఎంబీబీఎస్ నుంచి పీజీ వరకు విద్యార్థులు సూర్యాపేట కు రావడం ఈ ప్రాంతానికి గర్వకారణమన్నారు. మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 160 కోట్లు విడుదల చేసిందన్నారు.
ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న మెడికల్ కళాశాల భవనాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. నర్సింగ్ కాలేజ్ ను కూడా ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజ్ ప్రాంగణం లో నిర్మించి మెడికల్ హబ్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపల్ శారద, సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.