హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో అందరూ జాగ్రతలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణ పొరుగు రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు కేరళ, ఢిల్లీ తదితర రాష్ర్టాల్లో కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది.
కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఈ నెల 10, 11న కరోనా మాక్డ్రిల్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోనూ కొవిడ్ అనుమానిత లక్షణాలున్నవారి సంఖ్య పెరుగుతున్నట్టు గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. అనుమానిత లక్షణాలున్నవారు పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్గా తేలినవారు హోమ్ ఐసోలేషన్లో ఉండాలని తెలిపారు.
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నప్పటికీ వైరస్లో తీవ్రత లేకపోవడంతో దవాఖానల్లో చేరికలు లేవని డాక్టర్ రాజారావు తెలిపారు. ప్రస్తుతం వెలుగు చూస్తున్న కేసుల్లో ఎక్స్బీబీ వేరియంట్కు సంబంధించినవే 80 శాతానికిపైగా ఉంటున్నాయన్నారు. ఇది ఒమిక్రాన్ ఉపవేరియంట్ కావడం వల్ల పెద్దగా ముప్పు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతోపాటు వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారు కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించారు.