హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ 8 జిల్లాల పరిధిలో మూడు రోజులుగా ప్రత్యేక హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం 386 క్యాంపులు నిర్వహించి, మొత్తం 20,998 మందికి పరీక్షలు చేశారు. దీంతో ఇప్పటివరకు పరీక్షించినవారి సంఖ్య 45,672కు చేరుకొన్నది. మొత్తం 32 మందిని హెల్త్ క్యాంప్ నుంచి దవాఖానకు రెఫర్ చేశారు.
ప్రతి హెల్త్ క్యాంపులో సరిపడా ఔషధాలు ఉన్నాయని, 108 వాహనాలు అందుబాటులో ఉంచామని వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రస్థాయి హెల్ప్లైన్కు సోమవారం 34 మంది ఫోన్ చేసి సహాయం కోరినట్టు పేర్కొన్నది. వర్షాల నేపథ్యంలో కలుషిత నీరు తాగకుండా.. ప్రతి ఇంటికి క్లోరిన్ ట్యాబ్లెట్లు పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించింది. నోడల్ ఆఫీసర్లు డీపీహెచ్ శ్రీనివాసరావు ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో, డీఎంఈ రమేశ్రెడ్డి పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. దీంతోపాటు వైద్యారోగ్యశాఖ ప్రజలకు కొన్ని సూచనలను విడుదల చేసింది.