హైదరాబాద్ : రాష్ట్రంలోని రెండు ప్రైవేట్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల రద్దు చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయా కళాశాల విద్యార్థుల సీట్ల సర్దుబాటుకు ఎన్ఎంసీ ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం సీట్ల సర్దుబాటుకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, టీఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కన్వీనర్ కోటా అలాగే యాజమాన్య కోటా కింద 2021-22 విద్యా సంవత్సరానికి ప్రవేశం పొందిన ఎంబీబీఎస్ విద్యార్థులను రాష్ట్రంలోని 13 వైద్య కళాశాలల్లో సర్దుబాటు చేయనున్నారు. అభ్యర్థుల జాబితాను విశ్వ విద్యాలయ వెబ్ సైట్లో పొందుపర్చారు. ఈ నెల 29వ తేదీన ఉదయం 9 గంటల నుండి 30వ తేదీ సాయింత్రం 6 గంటల వరకు కళాశాల వారీగా ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు సంబంధించి సాంకేతిక సమస్యలకు 7842542216, 9059672216 నెంబర్లకు కార్యాలయ వేళల్లో సంప్రదించవచ్చు. కళాశాలల వివరాలు, అభ్యర్థుల జాబితా, మరిన్ని ఇతర వివరాలకు కొరకు యూనివర్సిటీ వెబ్సైట్ www.knruhs.telangana.gov.in ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.