హైదరాబాద్/వరంగల్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్ సందర్శనకు మంగళవారం వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సాగునీటి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఇతర మంత్రులు సాగునీటి విషయాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తటపటాయించారు. దాదాపు అన్ని ప్రశ్నలకూ అయోమయంలో పడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంటలకు ఎప్పటి నుంచి సాగునీరిస్తారని, బరాజ్ 20వ పిల్లర్ మరమ్మతులు ఎప్పటిలోగా పూర్తిచేస్తారు? అని.. ఇలా జర్నలిస్టులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. స్పష్టత ఇవ్వలేక దాటవేసే ప్రయత్నం చేశారు. ‘చర్చించి చెబుతాం.. నిపుణుల సూచన మేరకు నిర్ణయం తీసుకుంటాం..’ ఇవి రెండే సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల నోట వచ్చిన సమాధానాలు. ఇక ఇంగ్లిష్ మీడియా ప్రతినిధులు ప్రశ్నలడిగిన ప్రతిసారీ సీఎం రేవంత్రెడ్డి తన చేతిలోని మైక్ను మంత్రి ఉత్తమ్కుమార్కు ఇచ్చి సమాధానాలివ్వాలని చెప్పి తప్పించుకున్నారు. మీడియా సమావేశంలో విలేకరుల ప్రశ్నలు, సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమాధానాలు ఇలా ఉన్నాయి.