హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ తర్వాతే తెలంగాణ భాషకు, సాహిత్యానికి ఔన్నత్యం లభించిందని, పాఠ్యపుస్తకాల సిలబస్లోకి తెలంగాణ భాష ప్రవేశించడం పెద్దమార్పు అని మీడి యా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. తేనె కన్నా తీయనిది తెలుగు భాష అని అందులోనూ మట్టిలాంటి సహజమైన భాష తెలంగాణదని అభివర్ణించారు. బహుభాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్ రచించిన ‘తెలంగాణ-ఒక అవలోకనం’ గ్రంథాన్ని సాహిత్య అకాడమీ కార్యాలయంలో అల్లం నారాయణ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ భాష ఉపమాండలికాల కోణం నుంచి విస్తృతమైన అధ్యయనం చే యాల్సిన ఆవశ్యకత ఉన్నదని తెలిపారు.
నలిమెల భాస్కర్ 14 భాషలల్లో దిట్ట అని, తెలంగాణ భాషపై లోతైన అధ్యయనం చేశారని.. అది భావి సాహిత్యలోకానికి ఉపయుక్తంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ గ్రంథంలో తెలంగాణ పదాలు, క్రియలు, నుడికారాలు, ప్రాంతీయతలోని అంశాలు, ఉపమాండలికాల విశేషాలను వివరించిందని తెలిపారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూ రు గౌరీశంకర్ మాట్లాడుతూ.. ప్రామాణిక భాషగా తెలంగాణ భాషకు ఉండే ఔచిత్యం ఉద్యమసాహిత్యంలో ఏ మేరకు ఉపయోగపడిందనే విషయాలను భాస్కర్ లోతుగా చర్చించారని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి, కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి, ప్రము ఖ సాహిత్య విమర్శకుడు కేపీ అశోక్కుమార్, డాక్టర్ సంగనభట్ల నర్సయ్య, తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన ట్రస్ట్ కార్యదర్శి బొడ్డుపల్లి సుందర్ తదితరులు పాల్గొన్నారు.