హైదరాబాద్: ఉద్యమాల గుమ్మం.. ఖమ్మం గడ్డ నుంచి జాతిహితం కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. బీఆర్ఎస్ పొలికేక దేశం నలుమూలలను తాకనున్నది. కేసీఆర్ ఇక్కడి నుంచే జాతికి తన సందేశాన్ని ఇవ్వనున్నారు. అందుకోసం ఖమ్మం సర్వసన్నద్ధమైంది. నగరం మొత్తం గులాబీ మయమైంది. పార్టీ ఆవిర్భావం తర్వాత నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభకోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివస్తున్నారు. ఇందులో భాగంగా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారీ కాన్వాయ్తో ఖమ్మం బయలుదేరారు. ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, అరికపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద భారీ ఎత్తున కార్యకర్తలతో హైదరాబాద్ నుంచి పయణమయ్యారు.
అదేవిధంగా పాలకుర్తి నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కరీంనగర్ నుంచి మంత్రి గంగుల కమలాకర్ రావు, మానకొండూరు ఎమ్మె్ల్యే రసమయి బాలకిషన్ సభకు బయలుదేరారు. ఆయా నియోజకవర్గాల నుంచి ఖమ్మం తరలివెళ్తున్న కార్యకర్తల వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తరలివస్తున్నారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గుంటూరు నుంచి 250 కార్లలో కార్యకర్తలు, అభిమానులు ఖమ్మం సభకు వస్తున్నారు.