హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సేవా పతకాలను ప్రకటించాయి. వీరిలో రాష్ర్టానికి చెందిన సుమారు 281 మంది పోలీసు అధికారులకు బుధవారం రవీంద్రభారతిలో హోంమంత్రి మహమూద్ అలీ పతకాలను ప్రదానం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంట్రీ అవార్డుల మాదిరిగానే అత్యుత్తమ సేవలు అందించే పోలీసు అధికారులకు తెలంగాణ ప్రభుత్వం కొన్నేండ్లుగా ఈ అవార్డులను అందిస్తున్నది. వీరిలో 30 మంది పోలీస్ అధికారులకు అతి ఉత్రిష్ట్ సేవా పతకాలు, 28 మందికి ఉత్క్రిష్ట్ సేవా పతకాలు, ఏడుగురికి అసాధారణ్ అసూచన కుశలత పతకాలు, ఇన్వెస్టిగేషన్లో ఉత్తమ ప్రతిభ చూపిన 8 మందికి కేంద్ర హోంమంత్రి మెడల్స్, ట్రైనింగ్లో ఉత్తమ ప్రతిభ చూపిన 11 మందికి కేంద్ర హోంమంత్రి మెడల్స్, 11 మందికి శౌర్య పతకాలు, ఏడుగురు పోలీసు ఉన్నతాధికారులకు మహోన్నత సేవా పతకాలను అందజేయనున్నారు. వీటితోపాటుగా తెలంగాణ రాష్ట్ర ఉత్తమ సేవాపతకాలు 84 మందికి, ఆంత్రిక్ సురక్ష సేవా పతకాలు 67 పోలీస్ అధికారులకు, ఆంత్రిక్ సురక్ష సేవా పతకాలు 28 మంది పోలీసు అధికారులకు అందజేయనున్నారు. ఈ పతకాలను అందుకోనున్న వారిలో డీజీపీ అంజనీకుమార్, ఏడీజీ రాజీవ్ రతన్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఇద్దరు ఐజీలు, డీఐజీ ఒకరు, ఎస్పీలు ఇద్దరు, అడిషనల్ ఎస్పీలు ఐదుగురు, డీఎస్పీలు 22 మంది ఉన్నారు. వీరితోపాటు 39 మంది ఇన్స్పెక్టర్లు, 57 మంది ఎస్సైలు, 31 మంది ఏఎస్సైలు, 22 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 96 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు.