ఇటీవల ఎన్నికల ప్రచారంలో కత్తిపోట్లకు గురైన దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్లో చికిత్స పొందుతున్న ఆయన అంబులెన్స్లో వచ్చి .. మంత్రి హరీశ్ తోడురాగా నామినేషన్ వేశారు.
BRS | హైదరాబాద్/సిద్దిపేట, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అభ్యర్థులు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. ఏకాదశి మంచి రోజు కావడంతో గురువారం 109 మంది నామినేషన్లు వేశా రు. అభ్యర్థులు ఉదయాన్నే దేవాలయాల్లో పూజలు చేశారు. నియోజకవర్గ కేంద్రాలు ర్యాలీలు, గులాబీ జెండాలు, పార్టీ క్యాడర్తో కళకళలాడాయి. మిగిలిన అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు వేయనున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో, మంత్రి టీ హరీశ్రావు సిద్దిపేటలో నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ నేతలు, మంత్రులు నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, కోనేరు కోనప్ప, పద్మా దేవేందర్రెడ్డి, గాదరి కిశోర్, సైదిరెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, భాస్కర్రావు, సంజయ్కుమార్, ఆరూరి రమేశ్, కంచర్ల భూపాల్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి, నోముల భగత్, చింత ప్రభాకర్, గండ్ర వెంకటరమణారెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎన్ దివాకర్రావు, గూడెం మహిపాల్రెడ్డి, బాల్క సుమన్, చల్మెడ లక్ష్మీనరసింహరావు తదితరులు నామినేషన్లు వేశారు.
వరంగల్ పశ్చిమ, ములుగు, ఆలేరు, హుజూరాబాద్, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, గద్వాల, మహేశ్వరం, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గ అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఇటీవల కత్తిపోట్లకు గురై హైదరాబాద్లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి గురువారం దుబ్బాక ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి అంబులెన్స్లో వచ్చారు. ఆయనను అంబులెన్స్ నుంచి వీల్చైర్పై మంత్రి హరీశ్రావు పట్టుకుని కేంద్రానికి తీసుకెళ్లారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కొత్త ప్రభాకర్రెడ్డి నామినేషన్ పత్రాలను అందజేశారు.
అంబులెన్స్లో వచ్చిన ఎంపీని చూసిన బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, మంత్రి హరీశ్రావు భావోద్వేగానికి గురయ్యారు. మంచి మనిషికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అధైర్యపడవద్దని, మేమంతా అండగా ఉంటానమి ఎంపీకి ధైర్యం చెప్పారు. ఎంపీని చూడటానికి నియోజకవర్గం నలుమూలల నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భారీ ర్యాలీ దుబ్బాకకు వచ్చారు. అనంతరం ఎంపీ అంబులెన్స్లో తిరిగి వెళ్లారు.