బీసీల రిజర్వేషన్లను 20 శాతం నుంచి42 శాతానికి పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. కులగణనలో బీసీల లెక్కలు తేలిన తర్వాత కూడా రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచినట్లయితే పంచాయతీ సభ్యులుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, జడ్పీ చైర్మన్లుగా వారు ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పటోళ్ల శశిధర్ రెడ్డి అన్నారు. అందుకే ఈ విషయంపై తక్షణమే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయాలని సూచించారు. సుప్రీంకోర్టు సిఫారసు మేరకు డెడికేషన్ కమిషన్ రిపోర్టుతో సహా అసెంబ్లీలో చట్టం చేస్తే రాబోయే కాలంలో ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి న్యాయపరమైన ఇబ్బందులు ఉండవని అన్నారు. అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్లను పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.