హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగ నియామక పరీక్షలు సమీపిస్తుండటంతో అభ్యర్థులకు గ్రంథాలయాలు చక్కటి ఆశ్రయాన్నిస్తున్నాయి. కొన్ని గ్రంథాలయాల్లో రాత్రింబవళ్లు చదువుకొనేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థుల విన్నపాల దృష్ట్యా గ్రంథాలయాల పనివేళలను పెం చారు. కొన్ని గ్రంథాలయాలను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, మరికొన్ని రాత్రి 11 గంటల వరకు, ఇంకొన్ని రాత్రి 12 గంటల వరకు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా కేంద్ర గ్రంథాలయం రాత్రి 12 గంటల వరకు నడుస్తున్నది. ఈ గ్రంథాలయంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు రాత్రి అక్కడే నిద్రించే సౌకర్యాన్ని కల్పించారు. అభ్యర్థులు స్నానాలు చేసేందుకు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ గ్రంథాలయం 24 గంటల పాటు సేవలందిస్తున్నది.
గ్రంథాయాలకు వచ్చే అభ్యర్థుల ఆకలి తీర్చేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. భదాద్రికొత్తగూడెం జిల్లా గ్రంథాలయంలో ఓ దాత రోజు 150 మందికి మధ్యా హ్న భోజనాన్ని అందజేస్తున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లా గ్రంథాలయంలో నాలుగేండ్లుగా గ్రంథాలయానికి వచ్చే ఉద్యోగార్థుల ఆకలితీరుస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో కొంత కాలం పాటు భోజనాలు అందజేశారు. హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీ, అఫ్జల్గంజ్ లైబ్రరీల్లో రూ.5 భోజనం పథకాన్ని అమలుచేస్తున్నారు.