మెదక్: మెదక్ జిల్లాలో కాంగ్రెస్ (Congress) పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మెదక్ డీసీసీ అధ్యక్షుడు (Medak DCC President) కంఠారెడ్డి తిరుపతి రెడ్డి (Kantareddy Tirupati reddy) రాజీనామా చేశారు. డబ్బు సంచులే ప్రాతిపదికగా ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపు జరుగుతున్నదని ఆరోపించారు. పార్టీలో కష్టపడి పనిచేస్తున్నవారికి స్థానంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపించారు.
‘గత పదేండ్లుగా పార్టీ పటిష్టతకు కష్టపడి పని చేస్తున్న తన లాంటి కార్యకర్తలకు కాంగ్రెస్లో స్థానం లేదనే విషయం, ఇటీవల కాలంలో పార్టీలో వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఎవరికైనా అర్థమౌంతుంది. కాంగ్రెస్ కోసం చేసిన సేవలు, పార్టీ బలోపేతానికి చేసిన త్యాగాలు, పడిన కష్టాలు గుర్తించకుండా.. కేవలం డబ్బు సంచులే ప్రాతిపదికగా జరుగుతున్న పార్టీ టికెట్ల కేటాయింపులపై ప్రతినిత్యం వస్తున్న ఆరోపణలు, వాటి పరిణామాలను చూసి నేను తీవ్రమైన మనోవేదనకు లోనయ్యాను. అనేక సంవత్సరాల పాటు విస్తృతంగా పార్టీని బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషిచేశాను, అనేక అక్రమ పోలీస్ కేసులను ఎదుర్కొని న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నాను. కానీ జీవితాంతం కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులకు నాయకత్వం అప్పగించడంతో, వారి చేతిలో పార్టీ బందీ అయ్యింది. అలాంటి వారి నాయకత్వంలో పార్టీకి మనుగడ లేదు, ప్రజలకు కూడా ఉపయోగం లేదు. రాష్ట్రానికి ప్రయోజనం లేదు. కేవలం నోట్ల కట్టలను నమ్ముకునే వారు, రేపు రాష్ట్రాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నడిబజారులో నవ్వులపాలు చెయ్యడం ఖాయం.
గత పదేండ్లుగా పార్టీ అధికారంలో లేకున్నా ప్రజా క్షేత్రంలో ఉంటూ నేను పార్టీ పటిష్టతకై పూర్తి అంకిత భావంతో పనిచేశాను. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో పార్టీ పుంజుకుంటుందని నాలాంటి అనేకమంది కాంగ్రెస్ కార్యకర్తలు భావించారు. కర్ణాటక మోడల్, కాంగ్రెస్ మోడల్ అంటూ హడావిడి చేసిన పార్టీ నాయకత్వ వ్యవహార శైలి ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తున్నది. కేవలం డబ్బు సంచులు కలిగిన నాయకులకే సీట్లు అప్పగించడం కాంగ్రెస్ మోడలని ప్రజలు విశ్వసించేలా పరిణామాలు ఉన్నాయి. నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలతో సత్సంబంధాలు, నిరంతరం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం సాగిస్తున్న నాయకులకు కాకుండా, కేవలం డబ్బుల సంచులు ఉన్న నాయకులకు మాత్రమే సీట్లు దక్కుతాయని తేటతెల్లమైంది. పార్టీలో ప్రజాబలం ప్రాతిపదికన కాకుండా కేవలం ధన బలానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలాంటి వాటిపై ఏఐసీసీ అధ్యక్షుడితోపాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి అగ్ర నాయకులు కూడా మౌనం వహించడం నాకెంతో ఎంతో బాధ కలిగించింది.
ఒక నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా ఇలాంటి పరిణామాలను జీర్ణించుకోలేక, చూస్తూ పార్టీలో ఉండ లేక, బరువెక్కిన గుండెతో పార్టీని వీడటం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. మనోవేధనతో ఈ నా రాజీనామా లేక ద్వారా మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో ఇనాళ్ల నాకు అన్ని విధముల సహకరించిన వారందరికి ధన్యవాదములు’’ అంటూ తిరుపతి రెడ్డి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.