హైదరాబాద్, జూలై 14(నమస్తే తెలంగాణ): వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా గ్రామాల్లో డెంగ్యూ, టైఫాయిడ్ తదితర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా యుద్ధ ప్రాతిపదికపై అన్ని ముందు జాగ్రత్తచర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా కోరారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశమున్నందున పారిశుద్ధ్య చర్యలు, అంటువ్యాధుల నివారణ, తాగునీటి సరఫరా తదితర అంశాలపై పంచాయతీరాజ్ శాఖ సంచాలకుడు హన్మంతరావుతో కలిసి జిల్లా అధికారులతో గురువారం టెలికాన్ఫరెన్స్ సమీక్షించారు. పారిశుద్ధ్య పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులను ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. జిల్లా పంచాయతీ అధికారులందరూ జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉండాలని, జిల్లా కలెక్టర్ల ఆదేశాలు విధిగా పాటించడంతోపాటు కలెక్టర్ల అనుమతి లేకుండా జిల్లా కేంద్రం వదిలి వెళ్లరాదని ఆదేశించారు. గ్రామాల్లో దోమల బెడదను అధిగమించేందుకు ఫాగింగ్ చేపట్టాలని, తాగునీటి కలుషితం కారణంగా చూడాలని, వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
భగీరథ నీళ్లు శుద్ధిగా ఉండాలి
మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే నీరు కలుషితం కాకుండా క్లోరినేషన్ చేయాలని సందీప్కుమార్ ఆదేశించారు. ఇందుకోసం మిషన్ భగీరథ ఇంజినీర్లతో సమన్వయం చేసుకోవాలని కోరారు. పంచాయతీ కార్యదర్శులతో ప్రతి రోజు జిల్లా అధికారి సమీక్షించాలని, కార్యదర్శులు పనిచేయకపోతే సంబంధిత జిల్లా పంచాయతీ అధికారి బాధ్యత వహించాలని చెప్పారు. పాఠశాలలు తిరిగి సోమవారం తెరచుకోనున్నందున పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరారు. ముంపు ప్రాంతాలు, శిథిల భవనాల్లో నివసించేవారిని గుర్తించి సమీపంలోని కమ్యూనిటీ కేంద్రాలు, పాఠశాలలు, రైతు వేదికలు ఇతర పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరారు. అన్ని గ్రామ పంచాయతీలు బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ యంత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వానల వల్ల రోడ్డు మార్గాలు దెబ్బతింటే ప్రత్యామ్నాయ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్సులో రాష్ట్ర పంచాయితి రాజ్ శాఖ డిప్యూటీ కమీషనర్లు రామారావు, రవీందర్, జాన్ వెస్లీ పాల్గొన్నారు.