హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): మారుమూల ప్రాంతానికి చెందిన ఓ వృద్ధ మహిళ తన భర్తకు శస్త్రచికిత్స చేయించేందుకు హైదరాబాద్కు తీసుకొచ్చింది. దవాఖానలో నేరుగా ఆరోగ్యశ్రీ కౌంటర్కు వెళ్లింది. ఆరోగ్యమిత్రను కలిసింది. పేషెంట్ను దవాఖానలో చేర్చడం మొదలు డిశ్చార్జి అయ్యే వరకు ఆరోగ్యమిత్ర తోడుగా ఉన్నారు. ఇది రాష్ట్రంలోని అన్ని పెద్ద దవాఖానల్లో కనిపిస్తున్న దృశ్యమే. అనారోగ్యంతో ఉన్న పేదలకు ఉచితంగా, ఉత్తమ వైద్యం అందించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్న పథకం ఆరోగ్యశ్రీ. తమకు ఏదైనా ఆపద వస్తే ఆరోగ్యశ్రీ ఉన్నదనే ధీమా ప్రతి పేద కుటుంబంలోనూ కనిపిస్తున్నది. పెద్ద పెద్ద సర్జరీలు సైతం ఉచితంగా జరిగిపోతున్నాయి. ఈ మొత్తం ప్రక్రియలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్నది ఆరోగ్యమిత్రలు. పథకానికి వారు ముఖచిత్రమైతే.. రోగులకు ఆరోగ్యమిత్రులు.
లక్షల మందికి సాయం
రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు అనుసంధానమైన అన్ని దవాఖానల్లో ఆరోగ్యమిత్రలు ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా 885 మంది ఆరోగ్యమిత్రలు సేవలు అందిస్తున్నారు. రోగులు ఆహా ర భద్రత కార్డును తీసుకెళ్లి.. ఆరోగ్యశ్రీ కౌంటర్లో రిజిస్టర్ చేయించుకోవాలి. అక్కడి నుంచి ఉచితంగా వైద్యసేవలు అందించే బాధ్యతను ఆరోగ్యమిత్రలు తీసుకుంటారు. ఆరోగ్యశ్రీ కిం ద ప్రస్తుతం నెలకు సగటున 10 లక్షల మంది ఔట్ పేషెంట్ (ఓపీ), లక్ష మందికిపైగా ఇన్పేషెంట్ (ఐపీ) సేవలు పొందుతున్నారు. గత అక్టోబర్లో 1,17,427 మందికి ఐపీ సేవలు అందించారు. ఆరోగ్య మిత్రలతోపాటు దవాఖా న స్థాయిలో మెడికల్ కో ఆర్డినేటర్, ఆ పై స్థాయి లో టీమ్ లీడర్లు, జిల్లా మేనేజర్లు ఉంటారు.
ఆరోగ్యమిత్ర అందించే సేవలు
దవాఖానకు వచ్చిన పేషెంట్ ఆరోగ్యశ్రీ పథకానికి అర్హుడా.. కాదా? అని ముందుగా డాటాబేస్లో పరీక్షిస్తారు. ఆహార భద్రత కార్డులే దీనికి ప్రామాణికం. వారి వ్యాధి ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నదో లేదో పరిశీలిస్తారు.
అర్హులని తేలితే రిజిస్టర్ చేసుకుంటారు. ఉచితంగా ఓపీ, ఐపీ సేవలు అందేలా చూస్తారు.
ఆ దవాఖానలో సంబంధిత స్పెషాలిటీ సేవలు అందుబాటులో లేకపోతే.. ఎక్కడకు వెళ్లాలో సూచిస్తారు.
ఇన్పేషెంట్లకు సమయానికి ఆహారం అందుతున్నదా? చికిత్స ఎలా జరుగుతున్నది? వంటి వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తారు. ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తారు.
ఒకవేళ ఎవరైనా ముందుగా డబ్బు కట్టి.. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ కింద రిజిస్టర్ అయితే కట్టిన డబ్బు వెనక్కి వచ్చేలా సాయం చేస్తారు.
డయాలసిస్ పేషెంట్లకు ఎప్పటికప్పుడు ప్రీ అప్రూవల్ వచ్చేలా చూస్తూ సేవల్లో అంతరాయం కలగకుండా చూస్తారు.
ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ లబ్ధిదారులకు సైతం వీరు సహాయం చేస్తారు. ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ కింద దవాఖానలో చేరాలనుకునేవారు కచ్చితంగా ఆరోగ్యశ్రీలో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.
ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వెల్నెస్ సెంటర్లలో ఉచితంగా వైద్యసాయంతోపాటు బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక రోగాలకు ఉచితంగా మందులు అందేలా చర్యలు తీసుకుంటారు.
ఒకవేళ ఎవరైనా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాకపోయినా సీఎం సహాయనిధి నుంచి సాయం పొందేందుకు తోడ్పాటు అందిస్తారు. ‘సీఎం క్యాంప్ ఆఫీస్ బెనిఫిషియరీ కాపీ’ని ఇస్తారు. రోగి లేదా బంధువులు అందులో వివరాలను నింపి, నేరుగా సీఎం క్యాంప్ ఆఫీస్కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఆరోగ్యశ్రీ కోసం ప్రత్యేకంగా ఆఫీస్ ఉంటుంది. అందులో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు ఆరోగ్యమిత్రలు ఉంటారు. వారు ఆ దరఖాస్తును పరిశీలించి ధ్రువపత్రం జారీ చేస్తారు. దానిని తిరిగి దవాఖానలో అందజేస్తే ఉచితంగా చికిత్స అందుతుంది.