హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఖనిజాలు రవాణా చేసే వాహనాలు తరచూ ఓవర్ లోడింగ్కు పాల్పడుతుండటంతో.. వాటిని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు, ప్రమాదాల నివారణకు రాష్ట్ర రవాణాశాఖ కఠిన చర్యలు తీసుకోనున్నట్టు శుక్రవారం తెలిపింది. రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి, గనులు, భూగర్భశాస్త్ర శాఖ ఎండీ, ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్ అనుదీప్తో సంయుక్త సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఓవర్ లోడింగ్ నియంత్రణకు వేబ్రిడ్జి ఆధారిత ధ్రువీకరణతోపాటు డ్రైవర్ రిజిస్ట్రీని రవాణాశాఖ కొత్తగా ప్రవేశపెట్టనున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రవాణాశాఖ, గనులు భూగర్భశాస్త్ర శాఖలతో కలిపి ప్రత్యేకంగా ‘జాయింట్ వర్కింగ్ గ్రూప్’ ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. ఒకే వాహనంపై పదేపదే ఓవర్ లోడింగ్ గుర్తింపులు నమోదైతే చర్యలు తీసుకోనున్నారు. అదేవిధంగా మైనింగ్ రవాణా వాహనాలకు కూడా డ్రైవర్ రిజిస్ట్రీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో రవాణాశాఖ అదనపు కమిషనర్ రమేశ్, జేటీసీలు చంద్రశేఖర్గౌడ్, శివలింగయ్య తదితరులు పాల్గొన్నారు.