హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ, ఎస్టీల తరహాలో ప్రత్యేక అట్రాసిటీ చట్టం కావాలని అత్యంత వెనకబడిన కులాల సంఘాలు(ఎంబీసీ) డిమాండ్ చేస్తున్నాయి. బీసీ సంక్షేమశాఖ అధికారులు ఎంబీసీలోని 36 కులాల ప్రతినిధులతో ఇటీవల రెండురోజులు సమావేశమై ఆ కులాలు ఏం కోరుకుంటున్నాయి? ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి? ఏ రంగంలో ఉపాధి పొందాలని అనుకుంటున్నారు? తదితర అంశాలపై చర్చించారు. విద్యా, వైద్యం, ఉపాధి రంగాల్లో అవకాశమివ్వాలని వారు కోరారు. పిచ్చకుంట్ల, దొమ్మరి, వీరముష్టి వారిని కులం పేరిట దూషిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్టు తెలిసింది.
రాష్ట్రంలో బీసీ కులాల జీవన స్థితిగతులపై లోతైన అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆ బాధ్యతను, మార్గదర్శకాలను ఇటీవల ఏర్పాటయిన బీసీ కమిషన్కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంప్రదాయ కులవృత్తులతో జీవనం ఏ విధంగా సాగుతున్నది? ఆ వృత్తుల ఆధునికీకరణకు ఉన్న అవకాశాలు.. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై సూచనలు చేయాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలు ఎంత శాతం ఉన్నారో లెక్కలు తీయాలని పేర్కొన్నది. స్థానిక సంస్థల్లో బీసీల కోటా అమలుపై లోతయిన అధ్యయనం చేసి, బీసీ కులాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు అమలు చేయాల్సిన రిజర్వేషన్ ప్రక్రియను సైతం సూచించాలని బీసీ కమిషన్ను ప్రభుత్వం ఆదేశించింది.