ముషీరాబాద్, జూన్ 7: కోప్రగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ జర్నలిస్టు, రచయిత, ఎంబీసీ సిద్ధాంతకర్త, అభ్యుదయవాది కోలపూడి ప్రసాద్ (55) అనారోగ్యంతో మృతిచెందారు. పక్షపాతం కారణంగా మెదడులోని రక్తనాళాలు దెబ్బతినడంతో ఆయన ఆదివారం రాత్రి ఒంటి గంటకు కన్నుమూశారు. కోలపూడి ప్రసాద్ మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తంచేశారు. తాను నమ్మిన విలువల కోసం అహర్నిశలు పాటుపడిన కోప్ర మరణంతో అత్యంత వెనకబడినవర్గాలు తమలో ఒక గొప్ప మేథావిని కోల్పోయాయని విచారం వ్యక్తంచేశారు. కోప్ర కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నాలుగు రోజుల క్రితం కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకొన్న కోప్ర మరునాడు పక్షపాతం బారినపడ్డారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్లోని ఒక ప్రైవేటు దవాఖానకు తరలించారు. మెదడులో రక్తనాళాలు దెబ్బతినడం వల్ల చికిత్సకు అవయవాలు సహకరించడం లేదని, ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో కోప్రను కుటుంబసభ్యులు ఇంటికి తరలించారు. అప్పటి నుంచి కదలలేని స్థితిలో ఉన్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. సోమవారం పార్శిగుట్ట అంబర్నగర్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య నిర్మల, కూతురు సోనా ఉన్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లాలోని మారుమూల గ్రామంలో జన్మించిన కోప్ర వివిధ పత్రికలు, టీవీ చానళ్లలో పని చేశారు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ (ఎంబీసీ) సిద్ధాంతకర్తగా పేరుతెచ్చుకొన్నారు. పదునైన వ్యాస రచనలతో పలు ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య, వంగపల్లి శ్రీనివాస్ సోమవారం కోప్ర కుటుంబసభ్యులను పరామర్శించారు.