హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మార్చి నుంచి మే వరకు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నాలుగు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉన్నదని పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. మార్చి మొదటి వారంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నప్పటికీ, ఏప్రిల్ నుంచి మే వరకు పరిస్థితి మారుతుందని పేర్కొంటున్నారు.
గత 25 ఏండ్లలో చూసుకుంటే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అతి తక్కువ వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ పేర్కొంది. ఈసారి చలి తీవ్రత త్వరగా తగ్గిపోవడం వేసవి తీవ్రతకు సంకేతంగా కనిపిస్తున్నదని పేర్కొంది. ఫసిఫిక్ మహాసముద్రంలో ‘లానినా’ పరిస్థితులు బలహీనపడి ‘ఎల్నినో’ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో ఎండల తీవ్రత మరింత పెరిగే చాన్స్ ఉందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటాయి. గరిష్ఠంగా మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 36 డిగ్రీలు దాటాయి.