హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ గణితం-1బీ. ఈ సబ్జెక్టును తలచుకుంటేనే విద్యార్థులు భయపడిపోతారు. అంత కఠినంగా ఉంటుంది. విద్యార్థులను ఇంతకాలం భయపెట్టిన ఈ సబ్జెక్టు కాస్త సులభంకానున్నది. అత్యంత కఠినమైన పాఠ్యాంశాలను పుస్తకాల నుంచి అధికారులు తొలగించారు. విద్యార్థులను భయపెట్టే సబ్జెక్టుల్లో కెమిస్ట్రీ కూడా ఒకటి. ఈ సబ్జెక్టు కూడా విద్యార్థులను వణికిస్తుంది. ఈ సబ్జెక్టులో 30% సిలబస్కు కోతపడనున్నది. మరికొన్ని సబ్జెక్టుల్లోనూ 20% సిలబస్ తగ్గించారు. తొలిసారిగా ఇంటర్ పుస్తకాలను క్యూఆర్ కోడ్తో ముద్రించనున్నారు. అంతేకాకుండా వీటిని మల్టీకలర్స్తో ముద్రిస్తారు.
ఈ కొత్త పుస్తకాలు 2026 -27 విద్యాసంవత్సరం (వచ్చే విద్యాసంవత్సరం) నుంచి అందుబాటులోకి వస్తాయి. ఇంటర్ సిలబస్ను అధికారులు సమీక్షించారు. ఎన్సీఈఆర్టీ సిలబస్తో పోల్చితే మన సిలబస్ అధికంగా ఉన్నట్టు నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. ఎన్సీఈఆర్టీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుని కొత్త సిలబస్కు రూపకల్పన చేశారు. తెలుగు, చరిత్ర పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ చరిత్ర, కల్చర్ పాఠ్యాంశాలకు ప్రాధాన్యం కల్పించారు. ఈ సిలబస్ ఆధారంగా తెలుగు అకాడమీకి పుస్తకాల ముద్రణ బాధ్యతలు అప్పగించారు. ఏప్రిల్ రెండో వారంలోగా కొత్త పుస్తకాలు మార్కెట్లోకి అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. కొత్త సిలబస్పై వేసవి సెలవుల్లో లెక్చరర్లకు శిక్షణ ఇస్తారు.