రాష్ట్రంలో భారీగా పెరిగిన భూగర్భ జలాలు
నివేదిక విడుదల చేసిన భూగర్భ జలవనరుల శాఖ
హైదరాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గంగమ్మ పైపైకి ఉబికి వస్తున్నది. ఒకప్పుడు దుర్భిక్షంగా కనిపించిన ప్రాంతాలు నేడు కనుమరుగవుతున్నాయి. గతేడాది మార్చితో పోల్చితే రాష్ట్రంలో భూ గర్భ జలాలు 2.16 మీటర్లు పైకి వచ్చాయి. రాష్ట్రంలో 8.35 మీటర్ల లోతులోనే భూగర్భజలాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర భూగర్భ జలశాఖ నివేదికను విడుదల చేసింది. భూగర్భ జలాలకు సంబంధించి 33 జిల్లాల్లో 973 బావులపై పరిశోధన నిర్వహించింది. గతంతో పోల్చితే ఆరు జిల్లాల్లో భూగర్భ జలమట్టం స్వల్పంగా తగ్గగా.. మిగతా అన్ని జిల్లాల్లోనూ పెరుగుద ల నమోదైంది. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో గరిష్ఠంగా నమోదయింది. సంగారెడ్డి జిల్లాలో 8.11 మీటర్లు పైకిరాగా.. రంగారెడ్డి జిల్లాలో 7.93 మీటర్లు పెరిగాయి. వనపర్తి జిల్లాలో భూగర్భజలాలు 3.5 మీటర్ల లోతులోనే ఉన్నాయి. 24 జిల్లాల్లో 5-10 మీటర్ల లోతులో, ఎనిమిది జిల్లాల్లో 10 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో ఉన్నాయి.
18 శాతం ప్రాంతంలో 5 మీటర్ల కంటే తక్కువే
20 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో భూగర్భ జలాలు ఉన్న ప్రాంతాలను దుర్భిక్ష ప్రాంతాలు (రెడ్ జోన్)గా పరిగణిస్తారు. ఈ ప్రాంతాల విస్తీర్ణం గత పదేండ్లలో పోల్చితే రాష్ట్రంలో భారీగా తగ్గింది. మార్చి 2011-2020 వరకు రాష్ట్రం లో రెడ్జోన్ విస్తీర్ణం 7,302 చదరపు మీట ర్లు (7 శాతం)గా ఉండగా.. ఈ ఏడాది మార్చిలో పరిశీలిస్తే దీని విస్తీర్ణం 1,651చదరపు మీటర్లు (1.5 శాతం)కు తగ్గింది. 5 మీటర్ల కన్నా తక్కువ లోతులో భూగర్భజలాలు ఉన్న ప్రాంతం 2011-20 మార్చి వరకు 4,578 చ.మీ (4శాతం)ఉండగా.. ప్రస్తుతం 20,722 చ.మీ (18శాతం)కు పెరిగింది. జగిత్యాల, దక్షిణ తూర్పు ఆదిలాబాద్, పడమర ఆసిఫాబాద్, పడమర మంచిర్యాల, తూర్పు నిర్మల్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, తూర్పు కరీంనగర్, మహబూబాబాద్, మధ్య-పడమర ఖమ్మం, మధ్య సూర్యాపేట, వనపర్తి, నాగర్కర్నూల్, పడమర నారాయణపేట, నల్లగొండ, ఉత్తర-తూర్పు గద్వాల, రంగారెడ్డి జిల్లాల్లో అతి తక్కువ లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి.