హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు, పాజిటివిటీ రేటు వేగంగా పెరుగుతున్నాయని, ఐదు రోజుల్లోనే దాదాపు నాలుగు రెట్లు పెరిగాయని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. నెలాఖరుకు పతాకస్థాయికి చేరుకుంటాయని, ఫిబ్రవరి మధ్యలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నదని చెప్పారు. వచ్చే నాలుగు వారాలు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరారు. గురువారం కోఠిలోని తన కార్యాలయంలో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో థర్డ్ వేవ్ ప్రారంభమైందని చెప్పారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముం దే ఊహించామని, ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నదన్నారు. కొవిడ్ పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఇటీవలే సమీక్ష నిర్వహించారని, మంత్రి హరీశ్రావు నిత్యం సలహాలు, సూచనలు ఇస్తున్నారని తెలిపారు. గురువారం నుంచి 4 వారాలు వైద్య సిబ్బంది సెలవులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఒమిక్రాన్ సోకినవారు ఖరీదైన ఔషధాలు వినియోగించొద్దని డీపీహెచ్ సూచించారు. కరోనా నిర్ధారణ కాగానే భయపడి ప్రైవేటు దవాఖానల్లో చేరవద్దని తెలిపారు. ప్రైవేటు దవాఖానలు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రతిఒక్కరూ ప్రస్తుతం ఉన్న కొవిడ్ నిబంధనలు పాటిస్తే రాష్ట్రంలో కేసుల సంఖ్యను తగ్గించవచ్చని డీపీహెచ్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు వచ్చే నాలుగు వారాలు సభలు, సమావేశాలు నిర్వహించొద్దని కోరారు. ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలని సూచించారు. గుంపులుగా తిరుగొద్దని, ఇంట్లో, బయట మాస్కులు ధరించాలని చెప్పారు.
రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గురువారం 1,913 కేసులు నిర్ధారణ అయ్యా యి. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 1,214 కేసులు, రంగారెడ్డిలో 213, మేడ్చల్ మల్కాజిగిరిలో 161 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 3.5 శాతానికి పెరిగింది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రజల్లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో విమానాశ్రయంలో చేసే పరీక్షల సంఖ్య, వెలుగుచూసిన ఒమిక్రాన్ కేసులను వెల్లడించలేమని డీపీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 50 శాతం ఒమిక్రాన్ ఉండొచ్చని, నెలాఖరుకు 70 శాతం ఒమిక్రాన్ కేసులే ఉంటాయన్నారు. ప్రతిఒక్కరి నమూనాలు జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపడం సాధ్యం కాదని, వేరియంట్ కోసం శోధించకుండా కరోనా పాజిటివ్గానే పరిగణించాలని కోరారు.