మర్రిగూడ, ఆగస్టు 23 : నమ్మి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, ఓట్లేసిన ప్రజలను మోసం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి వచ్చే ఉప ఎన్నికలో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన స్వార్థం కోసం మునుగోడు ఉప ఎన్నికను తీసుకొచ్చారనే విషయం అందరికి అర్థమైందన్నారు. అందుకే ఇక్కడ తమ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించేందుకే ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్కు చెందిన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ యాకూబ్ అలీతోపాటు రాజాపేట తండా వార్డు సభ్యుడు రమావత్ లక్ష్మణ్నాయక్, ఏలె శారద, మర్రిగూడకు చెందిన 2వ వార్డు సభ్యుడు గ్యార యాదయ్య సహా పలువురు నాయకులు మంగళవారం హైదరాబాద్లో మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఉప ఎన్నికలో మునుగోడులో గులాబీ జెండా ఎగురుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో సుమారు వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలు హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. నూతనకల్ మండలం తాళ్లసింగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చూడి రాఘవరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంపత్రెడ్డితోపాటు మరో 14 మంది తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో హైదరాబాద్లోని తన నివాసంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో హైదరాబాద్లోని ఆయన నివాసంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.