కోల్కతా, మే 9: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని, ఎన్నికల కమిషన్ పక్షపాతంతో వ్యవహరించిందని, అందువల్లనే ప్రజల తీర్పుకు విరుద్ధంగా ఫలితాలు వెలువడ్డాయని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మొదటిసారి ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ప్రజల ముందుకు వచ్చారు. మొత్తం ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల కమిషన్తోపాటు పలు ప్రభుత్వ ఏజెన్సీలు పూర్తి పక్షపాతంతో వ్యవహరించాయని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ప్రజాస్వామిక సంస్థలు రాజీపడినట్టు కనిపిస్తున్నదని, ఫలితంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పారదర్శకత, విశ్వసనీయత లోపించిందని, ఇది తీవ్ర ఆందోళనకరమని వ్యాఖ్యానించారు.
ఓటర్ల జాబితా నుంచి సుమారు 30 లక్షల మంది పేర్లను తొలగించారని ఆరోపించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేయాలని, వీవీపీఏటీ స్లిప్ల లెక్కింపు పారదర్శకంగా జరిగిందో లేదో తేల్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంస్థలు ప్రజల్లో విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించినప్పుడే సమాజంలో ప్రజాస్వామ్యం మనగలుగుతుందని పేర్కొన్నారు. నిజానిజాలు వెల్లడించేందుకు జరిగే పోరాటంలో తాను ప్రతి తృణమూల్ కార్యకర్తతో భుజం భుజం కలిపి పోరాడుతానని, వారికి ఎప్పటికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.