హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వివిధ శాఖలు, జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న 45 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జాను ఆ ఉద్యోగం నుంచి తప్పించి జీఏడీ(పొలిటికల్) ముఖ్యకార్యదర్శిగా నియమించారు. ఆయనకు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రభుత్వం అదనపు బాధ్యతలను (ఎఫ్ఏసీ) అప్పగించింది. ఆయన స్థానంలో ఇరిగేషన్ కార్యదర్శిగా ఈ శ్రీధర్ను నియమించింది.
ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శిగా సంజయ్కుమార్ను తప్పించిన ప్రభుత్వం ఆ స్థానంలో ఎన్ శ్రీధర్ను నియమించింది. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫ్లాగ్షిప్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫ్లాగ్షిప్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అండ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్(సీఎస్ఆర్) పథకంగా పేరు మార్చింది. ఈ పథకానికి ప్రస్తుత అధికారి స్పెషల్ సీఎస్ సబ్యసాచి ఘోష్ను నియమించింది. సంజయ్కుమార్ను పంచాయతీరాజ్శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా నియమించింది. భవేష్ మిశ్రాను డిప్యూటీ సెక్రటరీ నుంచి స్పెషల్ సెక్రటరీగా ఉద్యోగోన్నతి కల్పించింది. ఆయన ఐటీ శాఖ స్పెషల్ సెక్రటరీగానే పని చేయనున్నారు. వీరితో పాటు పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది.


