మెదక్ : ఎన్నికల్లో అవకాశవాదులకు అవకాశం ఇవ్వకుండా, ఆడబిడ్డగా ఆదరించి మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో హవేలి ఘన్పూర్ మండల పరిధిలోని ముత్తాయిపల్లి, నాగారం చిన్న శంకరంపేట మండల పరిధిలోని అంబాజీపేట గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు 300 మంది మెదక్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వారు నియోజకవర్గ అభివృద్ధికి గాలికి వదిలేశారని ఆరోపించారు. 13 ఏళ్ల పాటు నియోజకవర్గ ప్రజల కష్టసుఖాలు తెలుసుకోకుండా ఎన్నికలు రాగానే కొడుకును తీసుకవస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ స్థితిగతులు తెలవని వారికి ఓటు వేస్తే నష్టపోతామన్నారు. అభివృద్ధిపాటు ప్రజా సంక్షేమానికి సమ ప్రధాన్యతనిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి చెందుతుందన్నారు.
ఇతర పార్టీలో నుంచి చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని, కొత్త, పాత అని తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హవేలి ఘన్పూర్ ఎంపీపీ నారాయణరెడ్డి, నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి తిరుపతి రెడ్డి, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, హవేలి ఘన్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.