జగిత్యాల, జనవరి 24 (నమస్తే తెలంగాణ)/మల్యాల/కొడిమ్యాల/ధర్మపురి: విభజన అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో భారీగా అభివృద్ధి జరుగుతున్నదని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపక తప్పదని జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా తయారు చేయించిన జనసేన ప్రచార రథం వారాహికి జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో మంగళవారం ప్రత్యేక పూజలు చేయించారు. ఆయన కూడా ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ అభివృద్ధిలో తెలంగాణ రాష్ర్టాన్ని ఆంధ్రా ప్రాంతంతో పోల్చడానికి వీల్లేదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం పటిష్ఠంగా పనిచేస్తున్నదని, ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు సలహాలు ఇచ్చే స్థాయిలో జనసేన పార్టీ లేదని, నేర్చుకొనే స్థాయిలోనే ఉన్నదని పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ సాధన కోసం ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీది పరిమిత పాత్రేనని తెలిపారు. పరిమితంగానైనా తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని పవన్ వెల్లడించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి శంకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తొలుత కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధానంలో పూజలు నిర్వహించిన పవన్.. వేంకటేశ్వరస్వామి, లక్ష్మి అమ్మవార్లను దర్శించుకొన్నారు. అనంతరం మరో పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీలక్ష్మి నర్సింహస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి పూజలు నిర్వహించారు. అర్చకులు పవన్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి పూజల అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు.
పవన్ పర్యటనలో అపశృతి యువకుడి మృతి..
పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకున్నది. అభిమానులు కేరింతలు కొడుతూ పవన్ కాన్వాయ్ని ఫాలో అయ్యారు. ముక్కట్రావ్పేటకు చెందిన కూస రాజ్కుమార్, కుమ్మరిపల్లికి చెందిన జక్కుల అంజి కిషన్రావుపేట స్టేజ్ దగ్గర బైక్తో ఎదురుగా బైక్పై వస్తున్న కిషన్రావుపేటకు చెందిన బొలిశెట్టి శ్రీనివాస్, తన బావమరిది నీలం సాగర్ను ఢీకొన్నారు. మరో కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కూస రాజ్కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, జక్కుల అంజి, శ్రీనివాస్, సాగర్ కాళ్లు విరిగాయి. క్షతగాత్రులను పోలీసులు దవాఖానకు తరలించారు.