వేల్పూర్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ దుర్గ మండలి, యాదవ యూత్,ఎస్సీ యూత్ నుంచి 100 మంది యువకులు ఆదివారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. గులాబీ కండువా కప్పి మంత్రి యువకులను పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ..కేసీఆర్ జనరంజక పాలన, అభివృద్ధిని చూసి ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన 100 మంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.
ఏర్గట్లను మండల కేంద్రం చేసుకోవడమే కాకుండా రూ.2 కోట్లతో అంతర్గత సీసీ రోడ్లు వేసుకున్నామని తెలిపారు. నియోజకవర్గం అంతటా గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందో గమనించాలన్నారు. యువత మౌనంగా ఉండకూడదని మంచి చేసే వారికి కచ్చితంగా ప్రోత్సాహం అందించాలన్నారు.
కరెంట్ ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ సబ్ స్టేషన్లు, సాగునీటి ఇబ్బందులు లేకుండా చెక్ డ్యాములు నిర్మించుకున్నామని తెలిపారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా నీటి గోస లేకుండా చేసుకున్నామని వివరించారు. ప్రజాస్వామ్యానికి అభివృద్దే మెట్టు కావాలని,పనికి-ఓటుకు లింక్ పెట్టి చూడాలన్నారు.
కేసీఆర్ కు ముందు కేసీఆర్ వచ్చిన తర్వాత అభివృద్ధి పై చర్చ జరగాలన్నారు. తెలంగాణలో ఇచ్చినన్ని ప్రభుత్వ ఉద్యోగాలు బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రతి పక్షాల అసత్య ప్రచారాలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏర్గట్ల ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్, పలువురు టీఆర్ఎస్ నాయకులు,స్ధానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.