హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఒకరిని మించి ఒకరు అవినీతి అనకొండలు బయటికి వస్తున్నారు. వీరి అక్రమాస్తుల చిట్టాలు చూసి ఏసీబీ అధికారులే విస్తుపోతున్నారు. వందల కోట్ల రూపాయలను కూడబెట్టిన ఇటువంటి తిమింగళాలను ఏసీబీ చరిత్రలో మునుపెన్నడూ చూడలేదని విస్మయం వ్యక్తంచేస్తున్నారు. తాజాగా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ (మల్టీజోన్-2) డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు ఏసీబీకి చిక్కారు. ఇతని అక్రమాస్తులను లెక్కిస్తూ.. ఏసీబీ అధికారులు చుక్కలు చూశారంటే అతిశయోక్తి కాదు.
ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలు బయటపడ్డాయని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. బీరువాలు, లాకర్లలో ఎక్కడ వెతికినా బంగారం కుప్పలు కుప్పలుగా దొరికిందని అంటున్నారు. ఇంకా సుమారు 8 కిలోల వరకు వెండి, ఇతర నగలు, వజ్రాల హారాలు.. భారీగా దొరుకడంతో నరహరిని తక్షణమే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నరహరిరావుపై విశ్వసనీయ సమాచారం మేరకు నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు.. మంగళవారం అతని ఇల్లు, ఆఫీసుతోపాటు బంధువుల ఇండ్లపై ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహించారు. ఆయనపై అవినీతి నిరోధక చట్టం, 1988 (2018 సవరణ చట్టం) లోని సెక్షన్స్ 13(1)(బి), 13(2) కింద కేసు నమోదు చేశారు.
10 చోట్ల ఒకేసారి దాడులు
నరహరిరావు తన సర్వీసు కాలంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడి, భారీగా అక్రమ ఆస్తులు సంపాదించారనే పకా సమాచారంతో ఏసీబీ మంగళవారం రంగంలోకి దిగింది. తెల్లవారుజాము నుంచే హైదరాబాద్లోని నరహరిరావు నివాసంతోపాటు ఆయన బంధువులు, బినామీలు, ఇతర సహచరులకు చెందిన మొత్తం 10 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు ప్రారంభించాయి. ఈ సందర్భంగా లభించిన దస్తావేజులు, నగదు, బంగారం చూసి స్వయంగా ఏసీబీ అధికారులే షాక్కు గురయ్యారు. ఇప్పటివరకు లెకించిన వివరాల ప్రకారం దొరికిన ఆస్తుల పత్రాల విలువే సుమారు రూ.13,05,67,100గా తేలింది. బహిరంగ మారెట్లో వీటి విలువ రూ.200 కోట్లకు పైనే ఉంటుందని అధికారుల అంచనా.
భార్య పేరిట రెండు బ్యాంకు లాకర్లు
నరహరిరావు భార్య పేరిట రెండు బ్యాంకు లాకర్లు ఉన్నట్టు ఏసీబీ దర్యాప్తులో తేలింది. వీటిని త్వరలోనే తెరిచి మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నామని అధికారులు చెప్పారు. ఇవి కూడా తెరిస్తే అక్రమాస్తుల విలువ మరికొన్ని కోట్లకు పైగా తేలే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం అదనపు ఆస్తులకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. పకా ఆధారాలతో పట్టుబడిన నరహరిరావును ఏసీబీ అధికారులు హైదరాబాద్ నాంపల్లిలోని ప్రిన్సిపల్ ప్రత్యేక న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే తక్షణమే 1064కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. లేదంటే 9440446106 (వాట్సాప్), ఫేస్ బుక్ పేజీ Telangana ACB, ఎక్స్ (ట్విట్టర్) @TelanganaACBకి సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం అందించిన బాధితుల/ఫిర్యాదుదారుల వివరాలు రహస్యంగా ఉంటాయని భరోసా ఇచ్చారు.

అధికారులతో ‘రియల్’ వ్యాపారం
అక్రమంగా సంపాదించిన డబ్బును నరహరిరావు పలువురు అధికారులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. టీఎన్జీవోకు చెందిన పలువురు అధికారులు, ఐటీశాఖకు చెందిన మరో అధికారి, ఎక్సైజ్శాఖలో ఉద్యోగ విరమణ పొందిన ఇంకో అధికారితో కలిసి కొన్ని కోట్ల రూపాయల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం. వీరు తమ అక్రమ సంపాదనను ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి మళ్లించినట్టు అధికారులు భావిస్తున్నారు. దీనిపై ఏసీబీ అధికారులు మరింత దృష్టిపెడితే.. చరిత్రలోనే అతిపెద్ద అవినీతి కొండను తవ్వినట్టు అవుతుందని అంటున్నారు. కాగా, ఇప్పటివరకు లభ్యమైనవి వివరాలు మాత్రమేనని.. ఇంకా అదనపు ఆస్తులపై ధ్రువీకరణ కొనసాగుతున్నదని ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ వెల్లడించారు. బినామీ పేర్లతో, ఇతర మార్గాల్లో మరిన్ని ఆస్తులు ఉన్నాయా? అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతున్నదని తెలిపారు.
నరహరి ఇంట్లో లభ్యమైన స్థిరాస్తుల వివరాలు
1) మహేశ్వరం (రంగారెడ్డి జిల్లా)లో ఐదు ఓపెన్ ప్లాట్లు
2) మహేశ్వరంలోనే 1.24 ఎకరాల వ్యవసాయ భూమి
3) పుప్పాలగూడలో ఒక విలాసవంతమైన హై-రైజ్ బిల్డింగ్లో 2,500 చదరపు అడుగుల విస్తీర్ణం గల రెసిడెన్షియల్ ఫ్లాట్
4) నార్సింగిలో హై-రైజ్ అపార్ట్మెంట్లో ఒకొకటి 1,860 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన రెండు ఫ్లాట్లు
5) రాజేంద్ర నగర్లో మరో హై-రైజ్ బిల్డింగ్లో 1,377 చదరపు అడుగుల ఫ్లాట్
6) గచ్చిబౌలి (టీఎన్జీవోస్ కాలనీ)లో ఒక భారీ జీ+3 అంతస్తుల నివాస భవనం
7) ఛత్రినాకలో మరో జీ+2 అంతస్తుల ఇల్లు
లభ్యమైన చరాస్తుల వివరాలు:
1) రూ.1.54 కోట్ల నికర నగదు
2) వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.2.29 కోట్ల బ్యాలెన్స్
3) రూ.5.04 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు
4) సుమారు 1.3 కిలోల బంగారు నగలు
5) దాదాపు 8 కిలోల వెండి, వస్తువులు, ఆభరణాలు
6) ఒక విలాసవంతమైన కియా కారెన్స్ కారు